తెలంగాణలో రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళి సై మద్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు వినబడుతూనే ఉన్నాయి. తాజాగా మరో సారి కేసిఆర్ సర్కార్ పై సంచలన కామెంట్స్ చేశారు తమిళిసై. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. తన ప్రైవసీకి భంగం కలిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు గవర్నర్ తమిళి సై. ఇటీవల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ తరుణంలో గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యల విషయంలో తాను ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తానని తెలిపారు.
రాజ్ భవన్ తలుపులు తెరుచుకుని ఉంటాయనీ, ప్రగతి భవన్ మాదిరి కాదని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ ప్రతిష్టను తగ్గించాలని చూస్తున్నారని, రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తారమని విద్యార్ధుల జేఏసీ పేరుతో వార్తలు వస్తున్నాయన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవనీ, తన పర్యటనకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నానని తెలిపారు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని విమర్శలు రావడం ఆశ్చర్యకరమని అన్నారు. సీఎంఓ నుండి మంత్రికి లేఖ రావడానికే జాప్యమైతే సమస్యలు ప్రగతి భవన్ కు ఎలా చేరతాయని గవర్నర్ తమిళి సై ప్రశ్నించారు.