Prajavani: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ప్రతి శుక్రవారం ప్రజా వాణి కార్యక్రమాన్ని జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తామని ప్రకటించినా, జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో వారానికి రెండు రోజులు (మంగళ, శుక్రవారం) కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని ప్రకటించారు. ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం భారీ స్పందన కనిపించింది.
హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు అర కిలో మీటరు మేర బారులు తీరారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రజాదర్భార్ పేరును ప్రజావాణిగా మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉదయం పది గంటల వరకూ వచ్చిన వారికే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రజా భవన్ వద్ద రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని పలువురు అభ్యర్ధులు, తమ సమస్యలను పరిష్కరించాలని లారీల యజమానులు, రెండు పడకల ఇళ్ల మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్ లపై వినతులు ఇచ్చేందుకు ఎక్కువ మంది ప్రజలు తరలివచ్చారు.
అర్జీదారుల సమస్యలను ఉన్నతాధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులకు తమ అర్జీలను అందజేస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
Janasena -TDP: ‘త్యాగ’రాజులు అవుతారా..? తిరగబడతారా..? టీడీపీలో అంతర్మధనం..!