Janasena – TDP: రాష్ట్రంలో టీడీపీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తొంది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా స్థిరమైన ఓటు బ్యాంక్ కల్పించుకునేందుకు నవరత్న పథకాల పేరుతో నగదు పంపిణీ కార్యక్రమాలను కఛ్చితంగా కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కొంత మేర వ్యతిరేకత ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో స్థిరమైన ఓటు బ్యాంకును వైసీపీ కల్గి ఉంది.
ఈ తరుణంలో అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు అన్ని ఏకం కావాలని భావిస్తున్నాయి. అధికార వైసీపీని ఎదుర్కోవడానికి కలిసి ప్రయాణం చేయాల్సిందేనని టీడీపీ – జనసేన ఫిక్స్ అయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అయితే ఖరారు అయ్యింది. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి జనసేన మద్దతు ఇచ్చినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధులను నిలపలేదు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేన వామపక్షాలతో కలిసి పోటీకి దిగింది. కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు గాజువాక, భీమవరం లోనూ ఓటమి పాలైయ్యారు.
జనసేన ఒక్క స్థానం గెలవగా, ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరిపోయారు. టీడీపీ కేవలం 23 స్థానాలనే గెలుచుకుంది. ఆ తరువాత నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన – టీడీపీతో కలిసి పోటీకి సిద్దమవుతోంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. గౌరవ ప్రదంగా సీట్లు జనసేన కోరుకుంటోంది. ఇదే పలు నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహుల్లో ఆందోళన కల్గిస్తొంది. సంవత్సరాల తరబడి ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలకు పొత్తులో భాగంగా తమ సీట్లను త్యాగం చేయాల్సి రావడం మింగుడు పడటం లేదు.
రాష్ట్రంలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావాలంటే కొందరు తమ సీట్లను త్యాగం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో కొందరు నాయకులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. జనసేనకు సీటు త్యాగం చేసి త్యాగరాజులు అయ్యేందుకు కొందరు సిద్దం అవుతున్నా మరి కొందరు మాత్రం రెబల్స్ గా మారి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.
ఇప్పటి వరకూ రెండు పార్టీల అధినేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశాలు జరిపారు. కానీ సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఇంత వరకు వెలువడలేదు. ఆయా పార్టీల వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయని అంటున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. ఎక్కడెక్కడ నుండి ఏయే పార్టీలు పోటీ ఉండాలి అనే అంశంపై ప్రాధమిక స్థాయిలో చర్చలు జరిగినట్లుగా సమాచారం.
ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటును ముగించి అభ్యర్ధుల ప్రకటన కూడా చేసే దిశగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రణాళిక సిద్దం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరు సీటు కోల్పోవాల్సి వస్తుంది..? ఎవరు సేఫ్ పొజిషన్ లో ఉంటారు..? అనే అంశంపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీటు కోల్పోయే వారిలో సీనియర్ నేతలు కూడా ఉండటం వారి అనుచరుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఈ పొత్తుల నేపథ్యంలో త్యాగరాజులు ఎవరు అవుతారు..? తిరగబడే వారు ఎవరు అవుతారు..? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
TS News: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. వారికి భద్రత తొలగింపు