TS News: తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి .. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసిఆర్ హయాంలో నియమించిన ప్రభుత్వ సలహాదారులను తొలగించారు. అలానే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదే క్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్ మెన్ లను విత్ డ్రా చేసింది. కొత్త గా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్ మెన్లను కేటాయించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో ఎవరెవరికి గన్ మెన్ లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదిక తర్వాత వారి భద్రత కోసం గన్ మెన్ లను ఏర్పాటు చేయనున్నారు.
మరో పక్క రేవంత్ సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనా దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ చార్జి ఎండీగానూ అమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషాకఫ్ ఆలీ, ఉత్తర డిస్కమ్ సీఎండిగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి గోపికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Chandrababu: వైసీపీ అసంతృప్తుల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు