look out notice: రోడ్డు ప్రమాదానికి కారణమై దేశం వదిలి పరారైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడు సోహైల్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బేగంపేట ప్రజా భవన్ (డిప్యూటి సీఎం క్యాంపు కార్యాలయం) వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు బీఆర్ఎస్ సీనియర్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అలియాస్ రాహిల్ కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ దుర్గారావును హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.
ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకుని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడ సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వగా, కారు సహా ప్రధాన నిందితుడు సాహిల్, ముగ్గురు యువతులను పోలీసు స్టేషన్ లో అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో రాత్రి విధుల్లో ఉన్న ఇన్ పెక్టర్ దుర్గారావు నిందితుడు సోహైల్ ను హోంగార్డుకు అప్పగించి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలకు పంపారు. ఆ సమయంలోనే సొహైల్ తప్పించుకుని పారిపోయాడు.
ఈ రోడ్డు ప్రమాద విషయాన్ని సొహైల్ దుబాయ్ లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. షకీల్ సూచనలతో అనుచరులు సొహైల్ ను తప్పించి ఆదివారం తెల్లవారుజామున వారి పనిమనిషి అబ్దుల్ అసిఫ్ (27) ను పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. తానే కారు నడిపినట్లుగా అతనితో చెప్పించారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైల్ కు పంపించారు. ముగ్గురు యువతులను ఆదివారం స్టేషన్ కు పిలిపించి వాంగ్మూలం తీసుకున్న సమయంలో కారు నడిపిన వ్యక్తి సొహైల్ గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బేగంపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల పుటేజ్ ను సేకరించారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సొహైల్ యే ప్రధాన నిందితుడు అని తేలింది.
దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పని మనిషిని పోలీస్ స్టేషన్ కు పంపినట్లు రుజువు అయ్యింది. సాంకేతిక ఆధారాలు సేకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సొహైల్ తండ్రి సూచనల మేరకు ముంబాయికి వెళ్లి అక్కడ నుండి దుబాయ్ కి పారిపోయాడు. ఈ నేపథ్యంలో సొహైల్ కోసం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి .. దుబాయ్ లో ఉన్న సొహైల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇదే క్రమంలో గత ఏడాది జూబ్లీహిల్స్ లో కారు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందిన ఘటనలోనూ సొహైల్ పాత్రపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరో సారి ఆ కేసు వివరాలు సేకరిస్తున్నట్లుగా పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నిందితుడు సొహైల్ తండ్రి షకీల్ సీనియర్ బీఆర్ఎస్ నేత. టీఆర్ఎస్ నుండి 2009 ఎన్నికల్లో బోధన్ నుండి పోటీ చేసిన ఓటమి పాలైన షకీల్ 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు.