Revanth Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad Bypoll) నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ మాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు మంత్రి కేటిఆర్ (KTR). మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (etela Rajender) తో టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రహస్య మంతనాలు జరిపారనీ, అందుకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు కూడా ఉన్నాయనీ, త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతానని కేటిఆర్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ TRS) ను ఎదుర్కొనలేక బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు కేటిఆర్. హుజూరాబాద్ లో ఈటల రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారని అన్నారు. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి గోల్కొండ రిసార్ట్స్ లో రహస్య సమావేశం అయ్యారని పేర్కొన్నారు.
Revanth Reddy: చీకట్లో ఈటలను కలవలేదు
ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా స్పందించారు. తాను ఈటలను బహిరంగంగానే కలిశానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి కుమారుడి పెళ్లి పత్రిక అందజేత సందర్భంగా నేతలందరం కలిశామనీ అంతే తప్ప ఈటలను తానేమీ చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తామిద్దరం కలిసిన సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నామని చెప్పారు. కేసిఆర్ కుట్రలను ఈటల వివరించారన్నారు. అసలు కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసిఆర్, కేటిఆర్ కాదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది మీ కాంట్రాక్టర్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
వాడివేడిగా ఎన్నికల ప్రచారం
హూజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగుతోంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బల్మూరు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. గెలుపుపై ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటారు.