KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కారు పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ స్పీడ్ పెంచారు. గతకొద్దిరోజులుగా వరుసగా జిల్లాలను చుట్టేస్తూ నియోజకవర్గాల్లో ప్రజలను తమ ను మరో సారి గెలిపించాలని కోరుతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. మరో సారి అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అమలు చేస్తామో చెబుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు కొన్ని రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
కేసిఆర్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మూడు జిల్లాల్లో, నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవకద్ర, ముక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభలకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కేసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్య తలెత్తింది. దేవకద్ర లో ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించి అప్రమత్తమైయ్యారు. వెంటనే హెలికాఫ్టర్ ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌస్ లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. సమాచారం తెలియజేయడంతో ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేసింది.