ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఏవై) పథకం కింద ఉచిత రేషన్ (బియ్యం) పంపిణీ పథకాన్ని కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయలేదు. ప్రధానంగా ఉచిత బియ్యం పంపిణీ ఎన్ఎఫ్ఎస్ఏ (కేంద్రం) కార్డులకు మాత్రమే కేంద్రం అందజేస్తుంది. నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (స్టేట్) కార్డులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 60 నుండి 70 శాతం కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేస్తుండగా మిగిలిన 30 శాతం కార్డులకు ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. అందుకే పూర్తి స్థాయిలో కార్డుదారులకు బియ్యం కేంద్రం అందజేస్తేనే తాము పంపిణీ చేస్తామని తెలుగు రాష్ట్రాలు ప్రధాన మంత్రి (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీని నిలుపుదల చేశాయి.
అయితే ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని కేంద్రం సెప్టెంబర్ వరకూ పొడిగించినా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల (ఆగస్టు)లో రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే, జూన్, జూలై మాసాలకు సంబంధించి మూడు నెలల రేషన్ ఒకే సారి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఈ ఉచిత బియ్యం పథకం పై ఏపి ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయాన్ని వెల్లడించలేదు. కేంద్రం పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా చేస్తేనే పంపిణీకి చర్యలు చేపడతామని ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గతంలోనే పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఏపి సర్కార్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుందా..? లేక కేంద్రం నుండి సమాధానం వచ్చే వరకూ వేచి ఉంటుందా..? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజికేఏవై) తీసుకువచ్చింది. ఈ పథకం కింద రేషన్ కార్డుదారుల్లో ఒక్కొక్కరికి అయిదు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో అయిదు కేజీల గోధుమలు పంపిణీ చేశారు. తొలుత ఈ పథకాన్ని 2020 ఏప్రిల్ నెల నుండి అమలు చేశారు. ఆ తరువాత విడతల వారిగా పొడిగిస్తూ వచ్చారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 మే నెల నుండి నవంబర్ వరకూ, తరువాత 2022 మార్చి వరకూ ఈ పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకూ మరో సారి ఉచిత రేషన్ పథకం అమలును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.