TS News: తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళి సై ఝలక్ ఇచ్చారు. గత కొంత కాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని ఇంతకు ముందు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వం రాజ్ భవన్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ తమిళి సై చాలా సందర్భాల్లో తప్పుబట్టారు. గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు కూడా చేశారు. తాజాగా గవర్నర్ తీసుకున్న కీలక నిర్ణయం రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత గ్యాప్ పెంచేదిగా మారింది. ఇవేళ గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కేసిఆర్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్ధులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్ధిత్వాలను తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డు వస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. అభ్యర్ధులు ఇద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా కానీ, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లుగా కనిపించడం లేదని గవర్నర్ ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయవద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) చెబుతోందని గవర్నర్ తమిళిసై ఉటంకించారు. గతంలో కౌశిక్ రెడ్డి అభ్యర్ధిత్వంలో కూడా ఇదే విధంగా ఝలక్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. కౌశిక్ రెడ్డిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కేసిఆర్ సర్కార్ నిర్ణయించి గవర్నర్ కు పంపగా, అప్పుడు కూడా కౌశిక్ రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు. తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్ధిత్వాల విషయంలోనూ అదే తరహాలో గవర్నర్ తిరస్కరించారు.
తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద భర్తీ చేసేందుకు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా, వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారు, విశిష్ట సేవలు అందించిన వారు లేక సెలబ్రిటీలు, క్రీడాకారులు లాంటి వారిని ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ నియమించడం జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు సిఫార్సు చేసిన ఇద్దరు అభ్యర్ధులు రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అభ్యర్ధుల నేపథ్యం చూసుకుంటే .. దాసోజు శ్రవణ్ 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా చేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుండి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పీఆర్పీ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జి గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఇక కుర్రా సత్యనారాయణ బీసీ సామాజిక వర్గానికి నేత, గతంలో 1999 నుండి 2004 వరకూ సంగారెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు.
Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఏ కోర్టుల్లో పరిస్థితి ఏమిటంటే..?