టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) కు బదిలీ చేశారు. సీసీఎస్ తరపున సిట్ ఇకపై ఈ కేసు దర్యాప్తు కొనసాగించనున్నదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో కేసు విచారణ జరగనున్నది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూశారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసిన ప్రవీణ్ కుమార్ కార్యాలయానికి వచ్చే చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

ప్రవీణ్ సెల్ ఫోన్ లో చాలా మంది మహిళల కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు. ప్రధాన సర్వర్ నుండి పేపర్ కొట్టేసిన ప్రవీణ్ లూప్ లో ఉన్న కంప్యూటర్ ద్వారా పేపర్ తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రశ్నా పత్రం ప్రింట్ తీసి రేణుక అనే మహిళకు ప్రవీణ్ షేర్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తమకు తెలిసిన వారిలో కొందరికి ప్రశ్నాపత్రం ఉందంటూ రేణుక చెప్పిందన్నారు. రేణుక భర్త, ఆమె సోదరుడు కలిసి తెలిసిన వాళ్ల వద్ద ప్రచారం చేశారనీ, ఒక్కో పేపర్ కి రూ.20 లక్షలు డిమాండ్ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలునకు ఇద్దరు అభ్యర్ధులు మాత్రమే ముందుకొచ్చారని చెప్పారు. పేపర్ కొన్న ఇద్దరిని తమ ఇంట్లోనే ఉంచి వారి చేత రేణుక ప్రిపేర్ చేయించిందని, పరీక్ష రోజున వనపర్తి నుండి అభ్యర్ధులను తీసుకువచ్చి నేరుగా సరూర్ నగర్ లోని పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను కస్టడీ కోరుతూ కోర్టులో బేగంబజార్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఈ లోపే సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు సీసీఎస్ సిట్ కు బదిలీ అయ్యింది.
YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్టు .. ఎందుకంటే..?