Telangana TDP: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్ధులను బరిలోకి దించి .. ప్రచారం కూడా ప్రారంభించాయి. కానీ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉండటంతో తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది, క్యాడర్ కు తాను అండగా ఉంటాననీ, ప్రచారం చేస్తానని నెల రోజుల క్రితం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ .. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపే చూడలేదు. అభ్యర్ధుల ఎంపికై దృష్టి పెట్టలేదు. తన సినిమా షూటింగ్ బిజీలో మునిగిపోయారు. దీంతో తెలంగాణ టీడీపీలో స్తబ్దత నెలకొంది.
ఓ పర్యాయం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజమండ్రి సెంట్రల్ జైల్ కు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అయి వచ్చారు. ఒక సారేమో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, మరో సారేమో 89 స్థానాల్లో పోటీ చేస్తామనీ అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ తరుపున పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న నాయకులు దరఖాస్తులు కూడా చేసుకున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తుండటంతో..ఇక టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని ప్రచారం జరిగింది.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా టీడీపీని వీడి అధికార బీఆర్ఎస్ లో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. నిన్నటి వరకూ ఈ వార్తలపై ఆ పార్టీ స్పందించకపోవడంతో రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ప్రచారంపై కాసాని క్లారిటీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. తెలంగాణలో పోటీపై చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు కాసాని. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది వెల్లడిస్తామని తెలిపారు.
ఏ పార్టీతో పొత్తు లేదని, ఒంటరిగానే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు కాసాని. తెలంగాణలో టీడీపీ పరిస్థిత చాలా బాగుందనీ.. ఆమాటకొస్తే ఏపీ కంటే తెలంగాణలోనే చాలా బాగుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కాసాని. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అంతా మీడియా సృష్టేనని అన్నారు. తన దృష్టిలో టీడీపీ మాత్రమే బెస్ట్ అని అన్నారు. ఇక రాజకీయ నేతల్లో నారా చంద్రబాబు బెస్ట్ అని వ్యాఖ్యానించారు. కాసాని వ్యాఖ్యలతో మొత్తానికి టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.
Telangana BJP: బీజేపీపై తీవ్ర అసంతృప్తితో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన బాబూమోహన్