అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ ప్రాంత రైతులకు అనుకూలంగా వస్తుందా? జగన్ సర్కార్ కు అనుకూలంగా వస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడి పనులు అక్కడితో నిలిచిపోయిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలపై సమీక్షలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత మారిపోయింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆందోళనలు చేయడం, నిరసనలు కొనసాగించడం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు, నిరసనలు టీడీపీ ప్రేరేపితమని వైసీపీ కొట్టిపారేస్తుంది. అమరావతి ప్రాంతంలో భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే చట్టపమైన చిక్కుల నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
అమరావతి ప్రాంతీయులకు శుభ వార్తేనా
మరో పక్క అమరావతి ప్రాంత ప్రజానీకం, రైతులు ఎగిరి గంతేసే వార్త ఒకటి లీక్ అయింది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాలపై సమీక్షించి, 70 శాతం నిర్మాణాలు జరిగిన ప్రాజెక్టుల ను పూర్తి చేయాలని సూచించారట. ఇది నిజమైతే అమరావతి ప్రాంతం వారు సంతోషించే వార్తే. అమరావతిలో రాజధానికి అనుకూలమైన సరైన సదుపాయాలు, శాశ్విత భవనాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, గ్రాఫిక్స్ తో కాలం వెళ్లదీశారని ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు విమర్శిస్తూ వచ్చారు.
ఇది దేనికి సంకేతం
ఇక్కడ చెప్పుకోవాల్సిందే విషయం ఏమిటంటే… తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి తొలుత దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడానికి జీవోలు ఇచ్చారు. విశాఖకు పరిపాలనా రాజధానిని మార్చాలనుకున్న తర్వాత ఆ జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇటీవల మళ్ళీ వీవీఐపీ ఇళ్ల ఖర్చు కోసం అంటూ ఏడున్నర కోట్ల రూపాయలతో కొత్త జీవోలు ఇచ్చారు. అయితే అవి సీఎం ఇంటి కోసమేనని అనుకుంటున్నారు. గతంలో అపేసి మరీ ఇప్పుడు ఖర్చు పెట్టడం, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకోవడం దేనికి సంకేతం? మారుతున్న ప్రభుత్వ వ్యూహానికి సంకేతమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.