Chiyaan Vikram: తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ నేమ్ అండ్ ఫ్రేమ్ సంపాదించుకున్న హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. నటుడిగా, నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభను నిరూపించుకున్న విక్రమ్ 58 పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా విక్రమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. 1966 ఏప్రిల్ 17న చెన్నైలో విక్రమ్ జన్మించాడు. అతని తండ్రి వినోద్ రాజ్ చిన్న స్థాయి నటుడు. తమిళ సినిమాలు మరియు టెలివిజన్ సీరియల్స్లో సహాయ పాత్రల్లో ఆయన నటించేవారు. అలాగే విక్రమ్ తల్లి రాజేశ్వరి సబ్ కలెక్టర్ గా వర్క్ చేశారు.
విక్రమ్ కు అరవింద్ అనే తమ్ముడితో పాటు అనిత అనే చెల్లెలు ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడిన దర్శకనటుడు త్యాగరాజన్ విక్రమ్ కు స్వయానా మావయ్యు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే విక్రమ్ త్యాగరాజన్ తో తనకు బంధుత్వం ఉందని ఎప్పుడూ చెప్పుకోలేదు. కనీసం సినిమా ఛాన్సుల కోసం ఆయన పేరు ఉపయోగించుకున్న సందర్భాలు లేవు. స్వయంకృషి, ప్రతిభతోనే విక్రమ్ ఎదిగాడు. చెన్నైలోని లయోలా కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో విక్రమ్ డిగ్రీ అందుకున్నాడు.
చిన్నతనం నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్న విక్రమ్.. కాలేజీ రోజుల్లో స్టేజ్ నాటకాల్లో నటిస్తూ యాక్టింగ్ పై పట్టు సాధించాడు. రంగస్థల నాటకంలో ఉత్తమ నటుడి అవార్డును కూడా గెలుచుకున్నాడు. అవార్డు అందుకుని ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్న విక్రమ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ మూడేళ్లు హాస్పిటల్లోనే ఉన్నాడు. అతని కాలికి ఇరవై మూడు శస్త్రచికిత్సలు చేశారు. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకుని స్టడీస్ కంప్లీట్ చేసిన విక్రమ్.. మొదట మోడలింగ్ లోకి ప్రవేశించాడు. టీవీఎస్ ఎక్సెల్, ఆల్విన్ వాచీలతో సహా పలు బ్రాండ్ల కోసం పని చేశాడు. 1988 మధ్య ప్రసారమైన గలాట్ట కుటుంబం అనే సీరియల్ తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించాడు.
1990లో ఎన్ కాదల్ కన్మణి అనే చిన్న-బడ్జెట్ మూవీతో హీరోగా విక్రమ్ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల కారణంగా విక్రమ్ కు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినాసరే విక్రమ్ వెనకడుగు వేయలేదు. 1993 నుంచి తెలుగు, మలయాళ చిత్రాల్లో విక్రమ్ బిజీ అయ్యాడు. హీరోగా కన్నా ఆయా భాషల్లో సహాయక పాత్రలే ఎక్కువగా పోషించాడు. తన కష్టతరమైన దశలో విక్రమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశాడు. ప్రభుదేవా, అజిత్ కుమార్, అబ్బాస్తో సహా ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. అయితే 1999లో బాల దర్శకత్వంలో వచ్చిన సేతు మూవీ విక్రమ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
ఈ సినిమాతో హీరోగా విక్రమ్ నిలదొక్కుకున్నాడు. సేతులో విక్రమ్ పోషించిన చియాన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి అతన్ని చియాన్ విక్రమ్ గా పిలవడం స్టార్ట్ చేశారు. ఇక సేతు తర్వాత విక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. ఎంత క్లిష్టమైన పాత్రైనా సరే ప్రాణం పెట్టి నటించే అతి కొద్ది మంది నటుల్లో ఒకరిగా విక్రమ్ పేరు తెచ్చుకున్నారు. ప్రయోగాలకు కేరాఫ్ అనిపించుకున్నారు. 58 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ విక్రమ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
విక్రమ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. అతని భార్య పేరు శైలజా బాలకృష్ణన్. 1980ల చివరలో శైలజను విక్రమ్ కలుసుకున్నాడు. 1992లో గురువాయూర్ ఆలయంలో విక్రమ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శైలజ ప్రముఖ చెన్నై పాఠశాలలో సైకాలజీ టీచర్గా పని చేసేవారు. 1993లో విక్రమ్, శైలజ దంపతులకు అక్షిత అనే కుమార్తె, 1997లో ధృవ్ అనే కుమారుడు జన్మించారు. 2017లో అక్షిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి యొక్క మనవడు మను రంజిత్ను వివాహం చేసుకుంది. 2020లో అక్షితకు ఒక పాప జన్మించింది. ఇక విక్రమ్ తనయుడు ధృవ్ గురించి తెలిసిందే. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ధృవ్.. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు.