TDP: నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పారు. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీల్లోని అసంతృప్తులు రాజీనామా చేసి ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ చేరారు. సీఎం జగన్మోహనరెడ్డి విధానాలు నచ్చక తాను తన పదవికి రాజీనామా చేసినట్లు చిరంజీవి రెడ్డి తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తారని నమ్మి తాను టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా లోకేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. లోకేష్ మాట్లాడుతూ .. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అన్ని విధాలుగా నష్టపోయారని అన్నారు. కొందరు ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత స్వార్ధం కోసం వ్యవస్థను పణంగా పెట్టి జగన్ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోక వచ్చిన తర్వాత బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి పోలీసులపై పని భారం తగ్గిస్తామని తెలిపారు.
EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు