బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం చెప్పాలి..నేరానికి నేరంతోనే సమాధానం చెప్పాలి..గ్యాంగ్ స్టర్ కి గ్యాంగ్ స్టర్ తరహాలోనే సమాధానం చెప్పాలి.. ఇది పోలీసులు రాసుకున్న స్క్రిప్ట్. దాన్ని పక్కాగా అమలు చేశారు. దీనిలో చట్టాలు, కోర్టులు, జైళ్లు ఇవేమి లేవు. నిన్న దొరకడం.. ఈ రోజు లేపేయ్యడం..కారణం చెప్పడం. తప్పు అయినా ఒప్పు అయినా, కారణం ఏదయినా పోలీసులకు అది తప్పదు. తాజాగా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో పోలీసులు ఇచ్చిన తీర్పు ఇది. దేశ వ్యాప్తంగా సంచలనం మారింది. చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పోలీసులు వాడిన బుల్లెట్ లకు లెక్క చెప్పుకోవాలి.సమాధానం చెప్పుకోవాలి. సంఘానికి సమాధాన పరుచుకోవాలి. కానీ చేసింది తప్పని బయటకు చెబితేనే ఒప్పని అంటుంది బయటి దేశం.
దిశ కేసు అందరికీ గుర్తే ఉంటుంది. నలుగురు యువకులు అత్యంత క్రూరంగా ఆమెను మానభంగం చేసి చంపేశారు. దేశ వ్యాప్తంగా ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అంతే సంచలనాత్మకంగా పోలీసులు నిందితులకు ముగింపు కూడా పలికారు. విచారణ కోసం ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకుని వెళుతుండగా నిందితులు పారిపోతున్నారు అని వారిని పట్టుకునే ప్రయత్నంలో దొరకకపోవడంతో పాటు పోలీసులపై వారు దాడి చేశారని, ఆత్మరక్షణ కోసం కాల్పులు చేశామని పోలీసులు అప్పుడు చెప్పారు. పోలీసులు చేసినది నాడు తప్పు అయినా ఒప్పే. ఒప్పు అయినా తప్పే. కోర్టుల దృష్టిలో, మానవ హక్కుల సంఘాల దృష్టిలో తప్పు కావచ్చు. కానీ సమాజం దృష్టిలో, మనిషి తత్త్వం దృష్టిలో మాత్రం అది ఒప్పే. అందుకే అక్కడ రెండు మూడు రోజులు పాటు కోర్టులు, మానవ హక్కుల సంఘాలు అంటూ రకరకాల వివాదాలు చెలరేగినా తర్వాత అది సైలెంట్ అయిపోయింది. చివరికి పోలీస్ కమిషనర్ సజ్జనార్ హీరోగా మారారు. ఆయన అంతకు ముందు వరంగల్ లో కూడా ఒక యువతిని హత్యాయత్నం కేసులో ఇలాగే ఎన్ కౌంటర్ చేశారు. సరే ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే..
వికాస్ దూబే.. జాతీయ స్థాయిలో గ్యాంగ్ స్టర్. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ సినిమాల తరహాలో గ్యాంగ్ స్టర్. ఈయనకంటూ ఒక ప్రత్యేక కోటరీ, ప్రత్యేక విభాగం పని చేస్తుంటాయి. పోలీసులకు దొరక్కుండా చాలా ఏళ్లుగా తిరుగుతున్నాడు. ఎనిమిది మంది పోలీసులను చీల్చి చెండాడి కాల్చి చంపిన చరిత్ర ఇతనిది. మరి ఈయన పోలీసులకు చిక్కితే పోలీసులు ఊరుకుంటారా. వారి స్టైల్ లోనే స్క్రిప్ట్ రాసుకొని వారి స్టైల్ లోనే పక్కాగా అమలు చేశారు. విచారణకు తీసుకెళ్తున్నామంటూ తీసుకువెళ్లారు. వాహనం ప్రమాదానికి గురైంది. కారు బోల్తా కొట్టింది. బోల్తా కొట్టిన కారు నుండి వికాస్ దూబే పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోతున్న వికాస్ దూబే ని పట్టుకుంటుండగా అయన పోలీసులపై ఎదురు దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసుల ఆయనను ఎన్ కౌంటర్ చేశారు. ఇది నిజం కావచ్చు కావచ్చు..కధ కావచ్చు.. కల్పితం కావచ్చు. ఇది కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో సంచలనం, చర్చనీయాంశం. ఇది కూడా తప్పు లాంటి ఒప్పు, ఒప్పు లాంటి తప్పు. ఇలా అనేక సంచలనాత్మక కేసులకు పోలీసులు అంతే సంచలనాత్మకంగా తీర్పు ఇవ్వడం ఇండియన్ పోలీస్ గురించి ప్రత్యేక పుటల్లో నింపుతుంది.