ఢిల్లీ, జనవరి 30: ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో నిందితుడు కార్తి చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు నేడు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులను విధించింది. మార్చి 5,6,7, 12 తేదీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హజరు కావాలని, పది కోట్ల రూపాయలు సుప్రీం కోర్టులో డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలలో టెన్నిస్ టోర్నమెంట్ల కోసం ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్లకు వెళ్లేందుకు కార్తి చిదంబరం సుప్రీం కోర్టును అభ్యర్థించాడు.
నిందితుడు కేసు విచారణకు హజరయ్యేందుకు తేదీలు ఖరారు చేయాలని సుప్రీం కోర్టు గత విచారణ సమయంలో ఇడి అధికారులను ఆదేశించింది.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం కార్తీ దాఖలు చేసిన పిటిషన్పై ఇడి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తరచు విదేశాలకు వెళ్లే వ్యక్తి కావడం వల్ల కేసు దర్యాప్తునకు ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
కార్తి చిదంబరం మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడు.