(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
అపర మేధావి, రాజనీతిజ్ఞుడు, దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి నర్శింహరావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేసి తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) క్రెడిట్ కొట్టేశారు. ఇది ఒక విధంగా కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమే అయి ఉండవచ్చు కూడా. అసలు పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన తెలంగాణ కాంగ్రెస్ గమ్మున ఉండటానికి కారణం లేకపోలేదు. పివి అంటే సోనియమ్మకు ఇష్టం ఉండదనీ, ఆయన పేరు చెబితేనే అగ్గిలం మీద గుగ్గిలం అవుతుందనీ ఆ పార్టీ నేతలందరికీ తెలిసిన విషయమే. పివికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఎవరైనా ముందుకు వచ్చి డిమాండ్ చేసినా, తీర్మానం ప్రవేశపెట్టినా ఆ నేతలకు అధిష్టానం వద్ద చీటీ చిరిగి పోతుందన్న భయం ఉందని అంటున్నారు. అందుకే ఈనాటి వరకూ కాంగ్రెస్ నేతలు ఆ విషయంపై నోరు ఎత్తలేదు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగకపోయినా కెసిఆర్ స్వయంగా పివికి భరతరత్న ఇవ్వాలంటూ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు కేంద్రానికి కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి పివి తమ వాడే ఓన్ చేసుకున్నాడు కెసిఆర్. సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనంత వరకూ మెజార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వారు. పివి మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరు ఫలితంగా, ఇతర కారణాల కారణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు అధికంగాా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో ఎక్కువగా టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, బిజేపి అనుకూలంగా మారిపోయారు. కెసిఆర్ తొలి నుండి బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అవసరమైన సందర్భాలలో సూచనలు, సలహాలు తీసుకోవడం ఆయనకు అలవాటు.
పివికి భారతరత్న ఇవ్వాలంటూ గతంలో బ్రాహ్మణ సంఘాలు ఒకటి రెండు పర్యాయాలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఒత్తడి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో మెజార్టీ బ్రాహ్మణులు భుజాన పార్టీ జెండా పట్టుకుని తిరగకపోయినా ఓటింగ్ విషయానికి వచ్చే సరికి టిఆర్ఎస్ అనుకూలం అన్న విషయం కెసిఆర్ కు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడగకపోయినా స్వయంగా తానే పివికి భారతరత్న ఇవ్వాలని కెసిఆర్ ప్రతిపాదించడంతో టిఆర్ఎస్ అనుకూలంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు చెక్కు చెదరకుండా ఉండటంతో పాటు బిజెపి, కాంగ్రెస్ పక్షాలకు అనుకూలంగా ఉన్న కొద్ది పాటి బ్రాహ్మణ ఓట్లు కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో దూర చూపుతో ఆలోచన చేసి కెసిఆర్ ఆలోచన చేసి సక్సెస్ అవ్వగా, తెలంగాణ కాంగ్రెస్ ఫేయిల్ అయ్యింది. తమ పార్టీ నాయకుడు పివి అని గట్టిగా వాదించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేకపోవడం దురదృష్టకరం. పివి పేరు ఎత్తితే ముస్లిం మైనార్టీ వర్గాలు దూరం అవుతాయన్న భయం కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. పివి హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిన నేపథ్యంలో ఆ పాపంలో ఆయన పాత్ర కూడా ఉందని ఆ వర్గాలు నమ్ముతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మేధావి, అపర చాణిక్యుడుగా పేరొందిన తెలంగాణ బిడ్డ పివికి భారతరత్న ఇవ్వాలని టిఆర్ఎస్ సర్కార్ కోరడం ముదావహం.