(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కొడాలి నానికి ఏమైంది ! టీడీపీపై ఉన్న కోపమా? చంద్రబాబుపై ఉన్న కసా? జగన్ పై ఉన్న అతి ప్రేమా? లేదా తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్న తత్వమా? అసలు కొడాలి నానికి ఏమైంది? ఎందుకీ అతి మాటలు. అతి భజన. టీటీడీ డిక్లరేషన్ లో తనకు సంబంధం ఏముంది? టీటీడీ వ్యవహారాన్ని వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్, దేవాదాయ శాఖ మంత్రి చూసుకుంటారు. కొడాలి నానికి ఏమి సంబంధం ? అసలు జరుగుతున్న దేవాలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం, టీటీడి డిక్లరేషన్ ఈ అంశాలపై మాట్లాడటానికి కొడాలి నాని వైసీపీ నాయకుడిగా మాట్లాడారా? మంత్రి హోదాలో మాట్లాడారా? అసలు సున్నితమైన అంశంగా రాష్ట్రంలో హిందువుల మనోభావాలు అంటూ రచ్చకెక్కుతున్న వేళ ఒ మంత్రి హోదాలో నాని ఇలా వాగడం వెనుక అంతరార్ధం ఏమిటి? అదే ఇప్పుడు అంతు పట్టడం లేదు!!.
ఆలయాల దాడులకు తోడు టీటీడిలో డిక్లరేషన్ అంశం కూడా ఇదే సమయంలో వివాదాస్పదం అయ్యింది. వీటిని పురస్కరించుకుని ఇతర రాజకీయ పక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి చిర్రొత్తుకొచ్చింది. మా ప్రభుత్వంపైనే మాటలు అంటారా ఊగిపోయారు. ఆ కోపంలో ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానట్లు అవేవో చిల్లర నేరాలుగా అంత సీరియస్ తీసుకునే విషయాలా అన్నట్లుగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు.
మంత్రి వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా ఉన్నాయనీ అంటున్నారు. మంత్రిగా ఎంతో హుందా తనంతో బాధ్యతగా మాట్లాడాల్సిన నేత ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టిన చందంగా మత పరమైన సున్నిత అంశంపై అగ్గికి అజ్యం పోసినట్లుగా మాట్లాడటం చూసి సాధారణ వ్యక్తులు సైతం విస్మయానికి గురయ్యారు. ఇది ప్రతిపక్షాలకు మరో అస్త్రంగా మారుతున్నది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి…మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులు ఏమీ కావనుకోండి. అధికార, విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం వేరు కానీ ఒ మతపరమైన అంశంలో ఆచిచూసి మాట్లాడకపోతే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటున్నారు.
ఇంతకూ కొడాలి నాని ఏమన్నారంటే…
రథం తగులబడింది దానికి ప్రభుత్వ ఖర్చుతో కొత్తది చేయిస్తుంది. వారిది ఏమి పోతుంది. ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఎమవుతుంది, అది ఒక చెక్క బొమ్మ, కిలో వెండి దొంగ ఎత్తుకుపోతే ఏమవుతుంది మహా అయితే ఆరు లక్షలు నష్టం ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి ఆపాదించి విమర్శలు చేయడమేనా అన్నట్లుగా మాట్లాడారు మంత్రి కొడాలి నాని, అదే విధంగా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో డిక్లరేషన్ విషయంపై మాట్లాడుతూ అసలు ఈ రూల్ పెట్టింది ఏవరు? ఇతర ఆలయాలు, మసీదులు, చర్చీలలో ఇటువంటి డిక్లరేషన్ సంస్కృతి లేదే, ఈ విధానం తిరుమలలో కూడా ఎందుకు. ఇది రాజకీయ పార్టీ పెద్దలు తెచ్చిన విధానమే అయి ఉంటుంది కాబట్టి దీనిపై చర్చించి పూర్తిగా తొలగించాలి అన్నారు కొడాలి నాని. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో ? ఇలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించి మంత్రినే వివరణ ఇవ్వమంటారా? చూడాలి. సాధారణంగా రాజకీయ నాయకులు ఏవో ఏవో మాట్లాడతారు ఏదైనా సమస్య ఎదురైతే తూచ్ తాను ఇలా అనలేదు మీడియానే వక్రీకరించింది అని బుకాయించడం చాలా సందర్భాలలో చూశాం. ఇప్పుడు జరిగేది కూడా అదేనేమో చూడాలి.