గత ఏడాది ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు.. కార్యకర్తలకు ఆర్ధిక కష్టాలు.. గత ప్రభుత్వంలోని బిల్లులను ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వంటి అంశాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతం టీడీపీ కొత్త జోష్ కోరుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తోంది. ఎన్నికలకు మరో మూడున్నరేళ్లు గడువు ఉంది. బీజేపీ చెప్తున్న జమిలీ ఎన్నికలు వస్తే మరో ఏడాదిన్నరే గడువు ఉంది. ఈనేపథ్యంలో టీడీపీ పునర్ణిర్మానం కోసం సమయం ఆసన్నమైంది. కానీ.. పార్టీలో ఇప్పటికీ అదే నైరాశ్యం, నిర్లిప్తత నెలకొని ఉంది. ఇలాగే కొనసాగితే టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకం అవుతుంది. వీటిని గుర్తించిన చంద్రబాబు పార్టీ పునర్ణిర్మానానికి పూనుకుంటున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
27 నుంచి కమిటీలు.. వచ్చే నెల నుంచి కార్యక్రమాలు..
ఈనెల 27 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్త అధ్యక్షులను నియమించబోతున్నారు. దాంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంచార్జిలను నియమిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలు, కార్యవర్గాన్ని ప్రకటించే ప్రణాళికను సిద్ధం చేసారని తెలుస్తోంది. ఈక్రమంలో 60 నుంచి 70 మందికి కొత్తగా పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ 15 లోపు ఈ వ్యవహారాలు అన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నారట. అక్టోబర్ 15 నుంచి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని కూడా ప్రణళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలపై ఉన్న అవినతి ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే..
ప్రస్తుతం నైరాశ్యంలో మునిగిపోయిన పార్టీ క్యాడర్ ను ఉత్తేజితం చేయడం కోసమే టీడీపీ ఈ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఓపక్క పార్టీ నుంచి జారిపోతున్న నాయకులు, నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురుదెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాని జిల్లాలు నాలుగు ఉన్నాయి. ఒక్క సీటు మాత్రమే వచ్చిన జిల్లాలు మూడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని తెలుస్తోంది.