బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వ్యభిచారం చేయడం ఎంతమాత్రం నేరం కాదని చెబుతూ న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ తీర్పును ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఓ గెస్ట్ హౌజ్లో వ్యభిచారం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ముగ్గురు మహిళలను, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ మహిళలను పోలీసులు ఓ ఆశ్రమానికి మార్పు కోసం తరలించారు.
అయితే ఆ మహిళలను తమకు అప్పగించాలని వారి తల్లిదండ్రులు, సంరక్షకులు మెజిస్ట్రేట్ కోర్టులో అప్పీల్ చేశారు. కానీ మెజిస్ట్రేట్ కోర్టు వారు విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమలో జస్టిస్ చవాన్ ఆ ముగ్గురు మహిళల పిటిషన్ను విచారించి తీర్పు చెప్పారు. వ్యభిచారం చేయడం నేరం కాదని అన్నారు. ఆ ముగ్గురు మహిళలను తక్షణమే విడుదల చేయాలని, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు వారిని అప్పగించాలని అన్నారు.
కాగా 1956 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం ప్రకారం వ్యభిచారం చేయడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించలేమన్నారు. ఆ మహిళలు మేజర్స్ అని, వారికి స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉందని, వారికి నచ్చిన వృత్తిని వారు ఎంచుకునే ప్రాథమిక హక్కు వారికి ఉందని జస్టిస్ చవాన్ అన్నారు. అందువల్ల ఆ మహిళలను తక్షణమే విడుదల చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.