“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్రైమ్ బ్యూరో
“పగటి వేళ రెక్కీ వేయడం. రాత్రి అయితే హత్యలు, దోపిడీలు చేయడం..!!
1996 – 2006 మధ్య తమిళనాడు జాతీయ రహదారి పక్కనే ఉండే ఇళ్లల్లో జరిగింది ఇదే..!
భావరియా ముఠా ఈ పని చేసేది. వీళ్ళను పట్టుకోడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దేశ వ్యాప్తంగా పోలీసుల మద్దతుతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంటుందా అనే రీతిలో శోధన జరిగింది.” ఈ జరిగిన కథని మూడేళ్ళ తెలుగులో “ఖాకీ” పేరుతో సినిమాగా వచ్చింది, కార్తీ హీరో..!!
ఇప్పుడు ఈ కథ ఎందుకు అంటే..!! అచ్చం అలాగే ఓ ముఠాని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ ను చిత్తూరు జిల్లా పోలీసులు పూర్తి చేసారు. అత్యంత విలువైన వస్తువులను పక్కా రెక్కీ వేసి గుర్తించి, అవి రవాణా అవుతున్న సమయంలో దోపిడీలకు పాల్పడి, అడ్డు వచ్చేవారిని హత్యలు సైతం చేసే “కంజర్ బట్” ముఠాను చిత్తూరు పోలీసులు సుమారు నెల రోజుల పాటూ శ్రమించి పట్టుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం, పోలీసులకు ఎలాంటి హానీ జరగకుండా ఆపరేషన్ ని ఇతర రాష్ట్రాల్లో నిర్వహించడం ఇదే ప్రథమం. అంతేకాదు కొవిడ్ మహమ్మారి వలన తాము ఈ ఆపరేషన్ ని విజయవంతంగా చేసుకుని రావడం పోలీసుల ప్రతిష్టను మరింత పెంచింది.!!
కంజర్ భట్.. ఎంతో ప్రమాదం..!!
కంజర్ బట్లు ఓ గిరిజన తెగ. మధ్యప్రదేశ్లోని కీలక పట్టణం ఇండోర్ కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని దేవాస్ పట్టణానికి సమీపంలోని థానే ఘాటీ తండాల్లో వీరు నివసిస్తుంటారు. పురుషులంతా ఎక్కువగా తమ ఆవాసాలను అడవుల్లోనే చేసుకుంటారు. మహిళలు మాత్రమే ఇళ్లలో కనిపిస్తారు. వివిధ రకాల గ్రూపులుగా ఏర్పడి దోపిడీలు పాల్పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఒకసారి దోపిడీ చేసిన తర్వాత ఆ సొమ్ము పూర్తిగా ఖర్చు చేసిన తర్వాత మాత్రమే మరో దోపిడీకి పథక రచన చేయడం వీరి వ్యూహం. ఒక్కో ముఠాలో సుమారు 20 నుంచి 35 మంది వరకు వీరు ఉంటారు.
ప్రణాళికతో మాటలు కలుపుతారు..!!
జాతీయ రహదారిపై విలువైన వస్తువులను రవాణా చేసే వాహనాలే వీరి లక్ష్యం. జాతీయ రహదారిపై లారీలతో సంచరించే వీరు దాబాల వద్ద లారీ డ్రైవర్ ల తో మాట కలిపి ఏ లోడు, ఎక్కడ వరకు వెళ్తుంది, ఏం చేస్తున్నారు అంటూ వివరాలను మాటల్లో కలిపి తీసుకుంటారు. బాగా డబ్బులు వచ్చే లోడుగా వారు భావించి దోపిడీ చేయాలని స్కెచ్ వేసిన తర్వాత వెంటనే ముఠాలోని సభ్యులంతా అలర్ట్ అయిపోతారు. నిమిషాల్లో దోపిడీకి సంబంధించిన స్కెచ్ రెడీ అయిపోతుంది. ఎక్కడ, ఎవరు, ఏ విధంగా దీనిలో పాలుపంచుకోవాలి అనేది ముఠాలోని సభ్యులంతా పంచుకుంటారు. సరుకుల లోడు వెళ్తున్న వాహనాన్ని వీరు తమ వాహనంతో పాటు వెంబడిస్తారు. నిర్మానుష్య ప్రదేశంలో లోడుతో వెళ్తున్న వాహనాన్ని తమ వాహనంతో ఢీ కొట్టి వాహనదారులతో గొడవ పెట్టుకుని, బెదిరించి క్షణాల్లో తమ వాహనంలో లోడు వేసుకొని మాయమవుతారు..!!
హత్యలకు వెనుకాడరు..!!
ఈ ప్రాసెస్ లో లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇతర వాహనాల సిబ్బంది నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురైనా వీరు ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. అందులోనూ ముఠా సభ్యులు 20 నుంచి 35 మంది వరకు సమీపంలోనే ఉండడంతో అంతా ఒక్కసారిగా ఏకమై తిరగబడి హత్యలు చేసే వరకూ పరిస్థితి ఉంటుంది. దోపిడీ చేసిన చోరీ సొత్తును తీసుకొని వీరు నేరుగా తానే గాటి అడవుల్లోకి వెళ్ళిపోతారు. అంతా తెలిసిన రహదారి కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సులభంగా సరుకుతో అడవిలోకి వెళ్లడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అనంతరం సరుకు ఎవరికి అమ్మాలో సంబంధిత డీలర్లు వ్యాపారులతో మాట్లాడి దానిని చక్కగా అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. వచ్చిన డబ్బును ముఠాలోని సభ్యులు పంచుకుంటారు. ఆ డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యే వరకూ మళ్లీ సదరు ముఠా ఎలాంటి నేరాలకు పాల్పడదు..!
ఎంతో రిస్క్ ఆపరేషన్ ..!
కంజర్ బట్ ముఠా అత్యంత ప్రమాదకరమైంది. వారు దోపిడీలకు పాల్పడే సమయంలో ఎలాంటి తేడా వచ్చిన మనుషుల్ని చంపేందుకు వెనుకాడరు. అలాంటి కీలకమైన ముఠాను వారి స్థావరం లోనే పట్టుకోవడం అంటే నిజంగా పెద్ద సవాలే. దీన్ని పోలీసులు ఉన్నతాధికారుల ఆలోచనలు సూచనలకు అనుగుణంగా చేసుకు వచ్చారు. ఆగస్టు 25న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి షియోమి సెల్ ఫోన్లు లోడుతో లారీ కంటైనర్ ముంబై వెళ్తుంది. నగరి సమీపంలో వచ్చేసరికి ఓ నిర్మానుష్య ప్రదేశంలో కంజర్ భట్ ముఠా లారీ ను తమ లారీతో ఢీ కొట్టి లారీ లోని సుమారు 8 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ కేసును ప్రాథమికంగా పరిశీలించిన జిల్లా పోలీసులు స్థానిక దొంగల ముఠాలు ఎవరు ఈ పని చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇలాంటి నేరాలు గతంలో నెల్లూరు జిల్లా తడ సమీపంలో జరిగిన దోపిడీ తో సరిపోల్చారు. రెండు నేరాలు ఒకేలా ఉండడం తో గతంలో తడ సమీపంలో దోపిడీకి పాల్పడిన కంజర్ భట్లే ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. దీంతో రెండు బృందాలను ప్రత్యేక ప్రణాళిక వేసి మధ్యప్రదేశ్ కు పంపారు.
పోలీసులే కూలీలుగా..!!
సాధారణ కూలీల్లా తానే గాటి తండాలను పరిశీలించిన పోలీసు బృందాలు అక్కడి పరిస్థితిని ముందుగా అంచనా వేశాయి. స్థానికులతో మాటామాటా కలపడం, బయటినుంచి కూలిపనులకు వచ్చినట్లు, ఏదైనా పని ఉంటే చూపించమని వేడుకుంటున్నట్లు పోలీసులు అడిగి స్థానికంగా యాక్టివ్గా ఉండే కొందరు ముఠా సభ్యుల గుట్టు లాగారు. అలాగే మరికొందరు అడవుల్లోకి వెళ్లి వస్తున్న వారి జాడలను గుర్తించారు. ఇలా సుమారు పదిహేను రోజులు పైగానే సీరియస్ ఎఫర్ట్ పెట్టడంతో నగిరి సమీపంలో దోపిడీకి పాల్పడిన ముఠాలోని సభ్యుల జాడ దొరికింది. చేయగలగడం మొదలుపెట్టాక వారు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది?? ముఠాలోని సభ్యులు ఎంతమంది ఉంటారు అనేది కీలకం గా అంచనా వేశారు. దోపిడీకి గురైన సెల్ఫోన్లో ఎక్కడ ఉన్నాయనే దానిపైన ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. ఓ అర్ధరాత్రి వేళ బృందంలోని ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీ సొత్తు వద్దకు వెళ్లి చూసి వచ్చి సరుకు ఎక్కడ ఉందో గుర్తించారు. దీంతో ఆపరేషాన్ కంజర్ భట్కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి పోలీసు బృందం అంతా ఏకమై అడవిలో ఉన్న దోపిడీ ముఠా స్థావరాన్ని చుట్టుముట్టింది. ఆ సమయంలో ముఠాలోని సభ్యులు తక్కువమందే ఉండడంతో అటు వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన రాలేదు. అందులోనూ అర్ధరాత్రి కావడంతో మిగిలిన వారు పోలీసులను ఏమాత్రం అడ్డుకోలేక పోయారు. పోలీసులకు ముఠా లోని ముగ్గురు చిక్కారు. మరో రెండు రోజుల్లో సొత్తు అమ్మడానికి మధ్యవర్తి తో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే పోలీసులు చాకచక్యంగా మెరుపుదాడి నిర్వహించడంతో దోపిడీకి గురైన రూ 8 కోట్ల చోరీ సొత్తు పోలీసులు స్వాధీనం అయింది. ఆపరేషన్ ఏ మాత్రం ఉదయం వేళ నిర్వహించిన, ముఠాలోని సభ్యులంతా ఉన్నప్పుడు తొందరపడిన పోలీసులకు పెద్ద నష్టం జరిగేది. పోలీసు బృందంలో ముగ్గురు సభ్యులు కోవిడ్ బారినపడిన ఏ మాత్రం వెరవకుండా ఆపరేషన్ సాగించిన తీరు ఖాకి సినిమా తరహాలో నే ఉంది..!