(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దుబ్బాక ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుబ్బాక అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం ఆశించి భంగపడిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక అసెంబ్లీ పార్టీ అభ్యర్థిత్వాన్ని శ్రీనివాసరెడ్డికి ఖారారు చేసింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటి సీఎం దామోదర్ రాజనర్శింహా, నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ ఆలీ తదితరుల సమక్షంలో చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
శ్రీనివాసరెడ్డి తండ్రి చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్ల ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో ఒక సారి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల సమయంలో చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ముత్యంరెడ్డి మృతి చెందారు. ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాసరెడ్డి నిన్నటి వరకూ టీఆర్ఎస్లో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోవడంతో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు.