టీఆర్ఎస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనయ కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీ ఎంట్రీ గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు.
మొదటి రౌండ్లోనే ఆమె విజయం ఖరారైపోయింది. మొత్తం 821 ఓట్లకు గాను కవితకు 531 ఓట్లు లభించాయి. అయితే, ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోంక్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
అసలేం జరిగిందంటే…
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఫలితాల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కూడా ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అయితే, ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. దీంతో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లోనే ఉండనున్నారు. “ఐదు రోజులు పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎమ్మెల్సీ అందుబాటులో ఉండడం లేదన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కవిత వెల్లడించారు.
ఆ ఎమ్మెల్యే ప్రకటనతో…
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటనతో ఎమ్మెల్సీ కవిత అలర్ట్ అయ్యారు. “రాపిడ్ టెస్టులో నాకు నెగటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను“ అని ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనికి బదులిచ్చిన ఎమ్మెల్సీ కవిత “మీరు వేగంగా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నేను ఇటీవలే మిమ్మల్ని కలిశాను. ముందు జాగ్రత్త చర్యగా వచ్చే ఐదు రోజులు నేను హోంక్వారంట్లోకి వెళ్తున్నాను“ అని తెలిపారు. కాగా, కవిత గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఆమె పొలిటికల్ రీ ఎంట్రీ గ్రాండ్గా జరిగిందని అనుకుంటున్న సమయంలో ఇఆల పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేదని పలువురు అంటున్నారు. అదే సమయంలో, కోవిడ్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండటమే కాకుండా, తన వల్ల మహమ్మారి విస్తరణ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారని అంటున్నారు.