కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ గురించి గత కొద్దికాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీకి వైసీపీ ఎంతో దగ్గర అని పేర్కొనడమే కాకుండా ఒక దశలోబీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో వైసీపీ చేరబోతోందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారం కేవలం ప్రచారంగానే ముగిసింది. వైసీపీ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని తాజా ఘటనలను పేర్కొంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
పోలవరం విషయంలో….
ఏపీకి వరప్రదాయిని అనే పేరున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని పలువురు విశ్లేషించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,234.288 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు నిధులను బహిరంగ మార్కెట్ ద్వారా సమీకరించి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది ఆదేశాలు జారీ చేశారు. పీపీఏ నిర్ధారించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగానికి తెలియజేయాలని కేంద్ర జల్శక్తి శాఖకు సూచించారు.
వీర్రాజు దూకుడు చూశారా?
ఈ నిధుల విడుదల ఆదేశాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికరంగా స్పందించారు. `పోలవరం బకాయిలను బేషరతుగా విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం“ అని ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది?
పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జరుగుతున్న ఆలస్యం పోలవరం పనులపై పడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పీపీఏ కూడా బలపరిచింది. దాంతో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులకు విఘాతం కలగకుండా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ క్రమంలో గత నెల 12న జారీ చేసిన షరతును ఉపసంహరించుకుంది. కాగా, ఈ విషయంలో క్రెడిట్ను బీజేపీ సొంతం చేసేందుకు ఏపీ బీజేపీ ఛీఫ్ ట్వీట్ చేశారని అంటున్నారు. సీఎం జగన్కు బీజేపీ రాజకీయం రుచి చూపిస్తున్నారని చెప్తున్నారు. అయితే, ఏపీకి దక్కాల్సిన ఇతర ప్రయోజనాల విషయంలో కూడా బీజేపీ నేతలు ఇదే తరహాలో వేగంగా స్పందించాలని పలువురు కామెంట్ చేస్తుండటం కొసమెరుపు.