ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 4700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈరోజు కనీసం 700 ఎకరాలు కూడా లేదని అన్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రభుత్వం చెప్తోందని, హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అక్బరుద్దీన్ అన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కేటీఆర్ ఫీలయ్యాడు బాస్
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్లపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. ‘ప్రముఖ నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్లు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని’ కేటీఆర్ ట్వీట్ చేశారు.
టీడీపీ నిరసన
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేయాలంటూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఎంఐఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు. గ్రేటర్ ఎన్నికల వేళ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్, పీవీ నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంఐఎం వ్యూహం ఏంటి?
జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల లెక్క ఏంటనే చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం ఇలా కామెంట్ చేయడం వెనుక ఎంఐఎం సానుభూతిపరుల ఓట్లు తమ ఖాతాలోనే ఉంచుకునే వ్యూహం ఒకటని , టీఆర్ఎస్తో తాము దూరం పాటిస్తున్నామనే సిగ్నల్స్ ఇవ్వడం మరొకటి అని అంటున్నారు.