నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా టక్ జగదీష్ సినిమా ని కంప్లీట్ చేసినట్టు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తుండగా నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తయారవుతోంది. తెలుగమ్మాయి రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇక నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో కూడా రెండవ సినిమా కావడంతో భారీగానే అంచనాలున్నాయి.
కాగా తాజాగా నాని నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమా నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఈనెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ను కోల్ కతాలో ప్లాన్ చేశారని సమాచారం. ఇక ఈ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. అందుకే మేజర్ పార్ట్ షూటింగ్ కోల్ కతాలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమాలో నాని కి జంటగా సాయి పల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో బాగా చర్చించుకుంటున్నారట. నాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు బల్క్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. కృతి శెట్టి కూడా ఎక్కువ రోజులే ఈ సినిమాకి కేటాయించినట్టు సమాచారం. కాని సాయి పల్లవి మాత్రం కాస్త గ్యాప్ గ్యాప్ గా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రాజెక్ట్ కి కాస్త సమస్య అవుతుందా అని మాట్లాడుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమాని మాత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా తో పాటు నాని అంటే సుందరానికీ అన్న సినిమా కూడా చేయబోతున్నాడు.