Visakha Steel Plant : పోస్కో కంపెనీ ఇప్పుడు ఏపీలో వివాదాలకు కేంద్రం బిందువుగా మారింది. దేశం మొత్తం వెతికి.. చివరికి ఏపీలోనే ఈజీ అనుకుని పాగా వేసేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అందుకు విశాఖలో స్టీల్ ప్లాంట్ పక్కనే తమ ఆధ్వర్యంలో ప్రైవేట్ పరిశ్రమ కూడా నెలకొల్పడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది..! ఇది చూడడానికి, వినడానికి సింపుల్ వ్యవహారంలానే ఉన్నప్పటికీ.. రూ. లక్ష కోట్ల విలువైన భూముల చుట్టూ ఒక కుంభకోణం అనే వాదనలూ లేకపోలేదు.
Visakha Steel Plant : ఆ రాష్ట్రాలు కాదన్నాయి.. ఏపీ దొరికిపోయిందా..!?
పోస్కో కొరియా దేశానికి చెందిన కంపెనీ. మన దేశంలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమ నెలకొల్పాలి అనుకుంది. అందుకే కనీసం 3 నుండి 4 వేల ఎకరాలు భూములు కావాలి అంటూ కొద్ది నెలలుగా తిరుగుతుంది. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించింది. ఆ ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఇక ఏపీపై కన్నేసింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా.. కేంద్రం – రాష్ట్రం కలిసి ఒకేసారి సంప్రదింపులు జరిపేలా.. ఇరు వర్గాల నుండి అంగీకారం వచ్చేలా పక్కా ప్రణాళికతో వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం.. అక్కడే అనేక వేల ఎకరాలు భూములు ఉండడం ఆ కంపెనీ కన్ను పడింది. సో.. ఇదే విషయాన్నీ కేంద్రం ముందుంచింది. “విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ఆ పక్కన భూములను మాకు ఇస్తే మేము ప్రైవేట్ పరిశ్రమ ఏర్పాటు చేసి.. స్టీల్ లో విశాఖ బ్రాండ్ ని కాపాడతాం” అంటూ ఒక ప్రతిపాదన పెట్టింది. తమకు అక్కడ 4 వేల ఎకరాలు భూములు ఇవ్వాలని కోరింది. అందుకే కేంద్రం సమ్మతించింది.
Must Read : విశాఖ ఉక్కు ఉద్యమం ఎవరికీ నష్టం..? ఎవరి పాత్ర ఎంత..!?
ఈ క్రమంలోనే పోస్కో ప్రతినిధులు గడిచిన ఏడాది కాలంలో మూడు సార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ని, అక్కడి భూములను సందర్శించారు. కొన్నాళ్ళు గోప్యంగా ఉన్నప్పటికీ.. కార్మికులు, ప్రజాసంఘాలు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇది మొత్తం జరిగి ఏడాదిన్నర కావస్తుంది. కానీ అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఈ వ్యవహారం మొత్తంలో కేంద్రం వెనుక ఉంటూ నడిపిస్తుంటే.., రాష్ట్ర ప్రభుత్వం అవుననలేక, కాదనలేక చూస్తుంది..!!
ఆ భూముల విలువ రూ. లక్ష కోట్లు..!!
విశాఖలో ఎకరం భూమి విలువ రూ. 5 కోట్లు ఉంది. స్టీల్ ప్లాంట్ దగ్గర్లో అంటే ఇది ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది. అంటే ఎంత కాదనుకున్నా ఆ 4 వేల ఎకరాల విలువ రూ. లక్ష కోట్లు ఉంటుంది. ఈ భూములను కంపెనీకి ఇస్తే.. 50 శాతం కేంద్రం వాటా.., 50 శాతం పోస్కో వాటాతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు పోస్కో ప్రయత్నాలు ఆరంభించింది. పనిలో పనిగా విశాఖలో ఇప్పుడు ఉన్న స్టీల్ పరిశ్రమలో కూడా తమకు వాటా కోరింది. అంటే మొత్తం ఆ కంపెనీ గుప్పిట్లోకి వెళ్లనున్నట్టే.. ఇదే విషయం బయటకు వచ్చి.. ఇప్పుడు రచ్చ జరుగుతుంది.
* లక్ష కోట్ల విలువైన భూములను ఆ కంపెనీ కొన్నాళ్ళు లీజుకి తీసుకుంటుందా..? తర్వాత ఆ భూముల పరిస్థితి ఏంటి..? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధివిధానాలు ఏంటి..? నాడు కేంద్రంతో కుదుర్చుకున్న ఎంవోయూలో అసలు లోపలి విషయాలు ఏంటి..? అనేది ఇప్పటికీ బయటకు వెల్లడి కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటో..!?
ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర ఎక్కువ. ఆ కంపెనీ సంప్రదింపులు కూడా కేంద్రంతోనే ఎక్కువ. కానీ ఇదే పోస్కో కంపెనీ ద్వారానే కడప జిల్లాలో కూడా స్టీల్ పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం.. పోస్కో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ తో ఇప్పటికే భేటీ కావడం చూస్తుంటే… విశాఖ స్టీల్ పరిశ్రమలో పోస్కో కంపెనీ దూరుతున్న వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది అనుకోలేం. కాకపోతే.. అక్కడ భూముల విషయంలో తలదూర్చి.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమని కూడా తమ పేరిటాకు మార్చుకుంటాం అంటూ పోస్కో పెట్టిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ అప్రమత్తమై.. ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే.. విశాఖ వేదికగా మరింత గందరగోళం తప్పకపోవచ్చు..!!