YSRCP : ఏపి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. టీడీపీకి కేవలం రెండు మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. మైదుకూరు, తాడిపత్రి మున్సిపాలిటీల్లో టీడీపీ గెలిచింది. అయితే ఈ రెండు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ లు టీడీపీకి దక్కే పరిస్థితి లేదు. తాడిపత్రిలో వైసీపీకి 16, టీడీపీకి 18 వార్డులు గెలుచుకోగా సిపిీఐ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డు గెలుచుకున్నారు. అదే విధంగా మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో విజయం సాధించగా జనసేన అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంప్ లకు తరలించారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో ఈ రెండింటినీ కూడా వైసీపీ కైవశం చేసుకుని నూరు శాతం ఫలితాలు సాధించామని చెప్పుకోనున్నది. ఇదే విషయంపై మంత్రి బొత్సా సత్యనారాయణ తన మనసులో మాట చెప్పేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో తాము చెప్పినట్లు నూరు శాతం వైసీపీ విజయం సాధించించడం పట్ల బొత్సా హర్షం వ్యక్తం చేశారు. ఒకటి రెండు మున్సిపాలిటీలు విజయానికి దూరం అయినా ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా వాటిని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారని సీఎం జగన్ చెప్పారన్నారు. తాజా ఫలితాల్లో అది నిరూపితమైందని బొత్సా పేర్కొన్నారు.