AP High Court : ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలకు నోటిపికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ పోలింగ్, 10వ తేదీ ఫలితాలు వెల్లడి అంటూ షెడ్యూల్ ప్రకటించేశారు. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అంతా బాగానే జరిగిపోతుంది, వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది అనుకుంటున్న తరుణంలో బీజేపీ షాక్ ఇచ్చింది.
ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరో ముగ్గురు కూడా ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. రేపు దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఆ తీర్పు, ఇప్పుడు కొత్తగా బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరో పక్క నేడు ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ, జనసేన, సిపిఐతో పాటు బీజేపీ బహిష్కరించాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించాలనే కీలక నిర్ణయం తీసుకోనున్నదని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పరిషత్ ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలుస్తొంది. బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటాయా లేదా అనేది ఇంక స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు న్యాయపోరాటం చేస్తున్నాయి. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే నీలం సాహ్ని హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది.