Telangana High Court : కోర్టు దిక్కరణ కేసులో ఓ జిల్లా కలెక్టర్ కు తెలంగాణ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు విధించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే.. ఆరు నెలల పాటు అనాధాశ్రమంలో వారానికి రెండు గంటల పాటు అక్కడ గడుపుతూ సేవ చేయాలని ఆదేశించింది. అదే విధంగా పౌర సరఫరాల శాఖ విశ్రాంత అధికారిణి పి సంధ్యారాణి ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల్లో అనాధాశ్రమానికి వెళ్లి భోజనాలు పెట్టాలని ఆదేశించింది.
గతంలో కోర్టు దిక్కరణ నేరానికి సంబంధించి ఈ ఇద్దరు అధికారులకు సింగిల్ జడ్జి కోర్టు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. అయితే ఆ తీర్పుపై వీరు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. వీరి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ నెల 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు దిక్కరణ నేరానికి సంబంధించి జైలుకు వెళతారా ? సామాజిక సేవ చేస్తారా ? నిర్ణయం మీ ఇష్టమంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇద్దరు అధికారులు సామాజిక సేవ చేయడానికి సమ్మతిని కోర్టుకు తెలియజేయడంతో బుధవారం పై విధంగా తీర్పు వెలవరించింది.