Corona Cases : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా 2,104 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1,78,841 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. దేశంలో కరోనా ప్రారంభం నుండి ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలి సారి.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, దేశంలో ఇప్పటి వరకూ 1,59,30,965 (1.59కోట్లు) కరోనా కేసులు నమోదు కాగా 1,34,657 మంది మరణించారు. కేవలం 17 రోజుల్లో రోజువారి కేసుల సంఖ్య లక్ష నుండి మూడు లక్షలకు చేరడం కరోనా వైరస్ ఉదృతిని అర్థం పడుతోంది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ 1,34,54,880 మంది కరోనా నుండి కోలుకోగా ప్రస్తుతం దేశంలో 22,91,428 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నుండి నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా 13,23,30, 644 డోసులను లబ్దిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఓ పక్క వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ మరో పక్క రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.