Sajjala Ramakrishna Reddy: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో ఏపిలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షల అమలు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇష్టాలకు వదిలివేసింది. ఈ నేపథ్యంలో ఏపిలో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ వినబడుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. కరోనా కట్టడి చర్యల విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరును చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వీటిపై ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. లాక్ డౌన్ విధించాలన్న వాదనలు వినబడుతున్నాయనీ, కానీ లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వం మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందనీ, దానికి తోడు ప్రజలు తీవ్ర ప్రభావానికి గురి అవుతారని అన్నారు. లాక్ డౌన్ ఇప్పటి పరిస్థితుల్లో వీలుకాదని సీఎం జగన్ భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందనీ, కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్మోహనరెడ్డి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రజల ఆక్షాంక్షల మేరకు సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారనీ, ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంటే రాష్ట్రానికి రావడానికే భయపడే చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని నీచ రాజకీయాలు చేస్తున్నారని సజ్జల తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సింది పోయి చంద్రబాబు తన వ్యాఖ్యలతో ఉద్యోగులను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.