BJP EX MLA: వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఏపి సీఐడీ రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే రఘురామ కృష్ణం రాజు అరెస్టును వైసీపీ మినహా వివిధ రాజకీయ పక్షాల నేతలు ఖండించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై క్షత్రియ సామాజిక వర్గంలో ఒక వర్గం ఆయనకు మద్దతుగా అరెస్టును ఖండిస్తుండగా, మరో వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నారు. కాగా దీనిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఉన్నాయనీ ఓ మీడియా అడిగిన ప్రశ్నకు విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ న్యాయవ్యవస్థను అస్థిర పర్చడానికి వైసీపీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ముక్కలు ముక్కలుగా నరికేయాలని చెప్పినప్పుడు అది అస్థిరపర్చడం కాదా అని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా అని అన్నారు. వాటికంటే రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా అని ప్రశ్నించారు. ఒక డిక్టేటర్ షిప్ గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వారిని మాట్లాడనివ్వరనీ, కలవడానికి సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని ఇదొక వింత ప్రభుత్వం..వింతైన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అప్పుడప్పుడైనా రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలన తెలుసుకోవాలని సూచించిన ఆయన కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర అయినా సమాచారం తీసుకోవాలన్నారు.