Lock Down: తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ను ఈనెల 30 వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ పొడగించారు కూడా. లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉంది. అయితే, దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా కీలక ఆదేశాలు వెలువడ్డాయి. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు.
కేసీఆర్ స్పెషల్ ఫోకస్
లాక్డౌన్ సడలింపుల సమయంలోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డుపై తిరగడం…చిన్నచిన్న కారణాలు చెప్పి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి లాక్ డౌన్ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు పోలీస్ కమిషనర్లు, ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్ డౌన్ ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతీరును ప్రతిరోజు జిల్లాల వారిగా సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని తెలిపారు.
పక్కా రూల్స్
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మికూడి కనిపిస్తున్నారని.. దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని డీజీపీ సూచించారు. 10 గంటల తర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై తగు చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుండే పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, డీఎస్పీలు, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులందరూ కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే, లాక్ డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని ఆదేశించారు.