Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య ఔషద పంపిణీకి ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కంటి మందు పంపిణీ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. విచారణ సందర్భంలో ఆనందయ్య కంటి మందును తాము వ్యతిరేకించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అయితే కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలియజేశారు. నివేదిక రావడానికి మూడు వారాల సమయం పడుతుందని చెప్పారు.
మందు వల్ల హానీ లేదని చెబుతూనే అభ్యంతరం ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్, పిల్ దాఖలు చేసిన న్యాయవాది యలమంజుల బాలాజీ వ్యతిరేకించారు. మందుకు అనుమతి ఇస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని న్యాయవాదులు అన్నారు.
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే మందు మందు వేసేందుకు అభ్యంతరం ఏమిటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రాణాలను కాపాడుకునేందుకే కంటి మందు కోసం అక్కడకి వస్తారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది.