Ycp Leader Arrest: చిట్ ఫండ్ స్కామ్ కేసులో విశాఖ అధికార వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ ను ఒడిసాలోని భువేశ్వర్ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో మళ్ల విజయప్రసాద్ ఆంధ్రప్రదేశ్, ఒడిసా, చత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారాలు నిర్వహించారు. డిపాజిటర్లను మోసం చేసిన రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిసాలో డిపాజిట్దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఒడిసా సీఐడీ పోలీసులు 2019లో విజయప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, మరియు 120 (బీ) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిసా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేజిహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అనుమతితో విజయప్రసాద్ ను ఒడిసాకు తీసుకువెళ్లారు.
మళ్ల విజయప్రసాద్ 2009 లో విశాఖ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచారు. 2019 ఎన్నికల్లో విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయితే ఆయనను జగన్ సర్కార్ ఇటీవల ఏపి ఎడ్యుకేషనల్ అండ్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది.
విజయప్రసాద్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పుడే పార్టీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేశాయి. విజయప్రసాద్ సంస్థ వెల్ఫేర్ సంస్థ, వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హదాలో మోసాలకు పాల్పడ్డాడని నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పేర్కొన్నారు.
కాగా 2016లో వందల కోట్ల చిట్ ఫండ్ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కేసులకు సంబంధించి అయిదు రాష్ట్రాల్లో 33 ప్రైవేటు సంస్థలు, కంపెనీ యాజమాన్యాలపై సీబీఐ సోదాలు జరిపింది. మళ్లా విజయ ప్రసాద్ తో సహా ఆనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నాడు మళ్లా ప్రసాద్ నివాసంలో సీబీఐ రూ.44.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నది.