KTR Vs Revanth: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటిఆర్ మధ్య మాటల యుద్ధం, ట్వీట్ ల వార్ చివరకు కోర్టుకు చేరడంతో సిటి సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కేటిఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేటిఆర్ పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడవద్దని స్పష్టం చేసింది. డ్రగ్స్, ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
డ్రగ్స్ కేసుతో ముడి పెడుతూ రేవంత్ రెడ్డి తప్పు ఆరోపణలు చేసి తన పరువుకు కలిగించారని ఆరోపిస్తూ కేటిఆర్ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశి్ంచాలనీ, పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కేటిఆర్ కోరారు. తన పరువుకు భంగం కలిగంచేలా చేసిన కామెంట్స్ ను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల నుండి తొలగించేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కేటిఆర్ పిటిషన్ లో కోరారు. కేటిఆర్ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.