Somu Veerraju: ఏపిలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తులకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లినా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. దీంతో హైకోర్టు తీర్పు మేరకు పాఠశాలలకు వేసిన రంగులను తొలగించారు. దీని వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం వివిద కార్పోరేషన్లు మున్సిపాలిటీలలో చెత్త సేకరణకు గానూ సరఫరా చేసిన వాహనాలకు కూడా మూడు రంగులు వేయడం వివాదాస్పదం అవుతోంది. ఈ చర్యలను ఏపి బీజేపీ తప్పబడుతోంది.
Somu Veerraju: చెత్త సేకరణ వాహనాలు పరిశీలన
ఏపీ బీ జే పీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం గుంటూరులోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు. వాటిపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసినందుకు హైకోర్టు నుండి మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం మానేసి తిట్ల దండకంతో సరిపెడతోందని విమర్శించారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ విధానం పోయి డబుల్ స్టిక్కర్ విధానం అమల్లోకి వచ్చిందని సెటైర్ వేశారు.
Somu Veerraju: వాహనాలపై మోడి స్టిక్కర్ వేయాలి
గ్రామాలు, నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వచ్చ సంకల్పం, స్వచ్చభారత్, స్వచ్చ సర్వేక్షణ కార్యక్రమాలను 2014 నుండి అమలు చేస్తున్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఏడాదికి రూ.1500 కోట్ల నిధులను నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామాలకు విడుదల చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో నిధలు ఇస్తున్నా చెత్త సేకరణ వాహనాలపై ప్రధాన మంత్రి మోడీ బొమ్మ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ రంగులు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోడీ ఫోటోను రాష్ట్రంలో ప్రజలకు కనిపించకుండా చేయాలనే జగన్ ప్రయత్నాన్ని తాము తిప్పి కొడతామని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఈ వాహనాలపై తక్షణం పీ ఎం మోడీ ఫోటో వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి చాలా నిధులు వస్తున్నాయని అయినా ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని సోము వీర్రాజు విమర్శించారు.