Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది. అన్నా డీఎంకే లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. జయలలిత హయాంలో తమిళనాట చక్రం తిప్పి చిన్నమ్మగా పేరొందిన ఏఐడీఎంకే బహిష్కృత నేత శశికళ పార్టీలో రీ ఎంట్రీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాట ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఆమె జైలు శిక్ష అనుభవించినందున మరో నాలుగైదు సంవత్సరాల వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. కానీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి అడ్డంకి ఏమి లేదు. దీంతో ఆమె అన్నా డీఎంకే లో పూర్వం మాదిరిగా చక్రం తిప్పాలని భావిస్తోందట. ఈ విషయాన్ని గమనించిన మాజీ మంత్రి పన్నీర్ సెల్వం.. శశికళ రీ ఏంట్రీ పై సానుకూలంగా స్పందించారు. శశికళ పార్టీలో తిరిగి చేర్చుకోవడంపై పార్టీ అధిష్టానంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం పార్టీలో సంచలన వార్త అయ్యింది. ఆమె పార్టీ పగ్గాలు చేపడితే పన్నీర్ సెల్వం, పళని స్వామిలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందని భావించి ఇద్దరూ రాజీకి వచ్చారు. ఈ క్రమంలోని పార్టీ సారధ్య బాధ్యతలను పన్నీరు సెల్వంకు దక్కాయి. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, ఉప సమన్వయకర్తగా పళని స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. దీంతో శశికళ పార్టీలో చేరిక కష్టతరమే అనుకుంటున్న తరుణంలో ఆమె వ్యూహాత్మక ఎత్తుగడలకు తెరలేపారు.
Sasikala Meets Rajinikanth: రజనీతో భేటీ
చిన్నమ్మ అన్నా డీఎంకేలోకి రీఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పాలని ఆశిస్తున్నా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఆమె ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో శశికళ భేటీ కావడం తమిళనాట రాజకీయాల్లో తీవ్ర సంచలన వార్త అయ్యింది. పొయెస్ గార్డెన్ లోని రజనీ నివాసానికి వెళ్లిన శశికళ దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. రజనీతో కలయిక పై ఆమె ఓ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసినా అంతర్గతంగా రాజకీయ ప్రాధాన్యత ఉందని మాత్రం ప్రచారం జరుగుతోంది. రజనీతో కలయికపై ఆమె చెప్పిన కారణం ఏమిటంటే… రజనీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు. అని శశికళ పేర్కొన్నారు. అయితే ఇక్కడా ట్విస్ట్ ఉంది. అన్నా డీఎంకే చీఫ్ గా ప్రకటన విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రజనీ కాంత్ ను గతంలోనే సీఎం స్టాలిన్ పరామర్శించారు. అయితే అన్నా డీఎంకే నుండి ముఖ్యనేతలు ఎవరూ ఆయనను పరామర్శించలేదు. ఈ తరుణంలో అన్నా డీఎంకే నాయకురాలిని తానేనని పదేపదే చెప్పుకుంటున్న శశికళ రజనీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ కాంత్ ను నేరుగా వెళ్లి కలవడం వల్ల ఆయన అభిమానాన్ని పొందాలన్న రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు. రజనీతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. అవసరం అయిన సందర్భంలో మద్దతు కావాలని రజనీకాంత్ ను శశికళ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు తమిళనాట ఆసక్తికరంగా మారాయి.