YS Jagan: రాష్ట్రంలో రాజకీయం రెండు, మూడు పార్టీలు, ముగ్గురు నాయకుల మధ్య తిరిగితే తిరగొచ్చు.. కానీ ఆ పార్టీలు, ఆ నాయకులు కొన్ని వర్గాల మధ్య తిరిగి ఓట్ల వేట చేయడమే రాజకీయ లోతు.. ఏపీలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయ్యింది. రాబోయే రెండున్నర సంవత్సరాల పరిపాలనకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతోంది. ఆయన పదవీ కాలం 30 నెలలు ఉండగా నెల నెలా తగ్గుతూ వస్తుంది. బహుశా ఇంకో 15 – 18 నెలలు మాత్రం పరిపాలన సవ్యంగా ఉంటుంది.. ఆ తర్వాత మొత్తం రాజకీయమే.., ప్రచారమే..! ఎన్నికల పాలిటిక్స్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది…! అయితే ఈ రెండున్నర సంవత్సరాల్లో సీఎం జగన్ 2019లో తనకు అండగా నిలబడిన కొన్ని వర్గాలను దూరం చేసుకున్నారు.
జగన్మోహనరెడ్డి ఈ రెండున్నర సంవత్సరాల్లో తన రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని వెసులుబాటులు ఇచ్చేశారు. తనకు 2019 లో ఏయే వర్గాలు బలంగా ఉన్నాయో.., మద్దతుగా నిలిచాయో.. వాటిలో కొన్ని వర్గాలను జగన్ ప్రస్తుతం దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వర్గాలు న్యూట్రల్ గానే ఉన్నాయి. వాటిని అందుకోవడమే లక్ష్యంగా అటు చంద్రబాబు, టీడీపీ పావులు కదుపుతున్నారు. ఆ వర్గాలు ఏవి..? జగన్మోహనరెడ్డి ఎందుకు కోల్పోయారు..? చంద్రబాబు ఆ వర్గాలకు దగ్గర అయ్యే అవకాశం ఉందా.., లేదా..? అనేది పరిశీలిస్తే…
YS Jagan: ఇదీ వర్గాల వారీగా పరిస్థితి
* ఉద్యోగులు: ఈ వర్గాల ఓట్లు అన్నీ కలిపి సుమారుగా 35 లక్షల వరకు ఉంటాయి..! వీరికి డిమాండ్లు ఎక్కువ. పని తక్కువ. సీఎం జగన్ వీరికి చాలా బాకీ పడ్డారు. ఆరు డీఏలు ఇవ్వలేదు. జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. పీఆర్సీ అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తే వారంలో చేసేస్తానన్న సీపీఎస్ ఇప్పటికీ రద్దు చేయడం లేదు. ఇవన్నీ వాళ్ళ కనీస హక్కుగా ఉద్యోగులు ఫీలవుతున్నారు. కానీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించడం లేదు. దీంతో వీళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారనేది వాస్తవం. ఇది వైసీపీ వాళ్లకు కూడా తెలుసు. బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇదే ఉద్యోగులకు 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇచ్చారు. రిటైర్ మెంట్ వయసు పెంచారు. అయినప్పటికీ పని రాక్షసుడిగా వీడియో కాన్షరెన్స్ లు, సెట్ కాన్ఫిరెన్స్ అంటూ ఉద్యోగులను వేధించుకుని తినడంతో 2019 ఎన్నికల్లో వీళ్లు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంలో తమ సహకారం అందించారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఉద్యోగ సంఘ నాయకుడు రెండు చేతులతో వేశామని కూడా వ్యాఖ్యానించాడు. ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడుగా ఆయన ఆ మాట అనకూడదు. కానీ ఈ ప్రభుత్వం రావడానికి మేము కృషి చేశాము అని చెప్పడం కోసం ఆ మాట అనేశారు. ఇప్పుడు ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి దూరంగా జరిగారు. న్యూట్రల్ అయ్యారు..!
* నిరుద్యోగ యువత: ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువత కూడా జగన్ పై భారీ ఆశలే పట్టుకున్నారు. వీరి ఓట్లు సుమారుగా 15 నుండి 18 లక్షలు ఉంటాయి.. మెగా డీఎస్సీ అన్నారు రాలేదు. భారీగా ఉద్యోగ ప్రకటనలు అన్నారు. ఇవ్వడం లేదు. అందుకే నిరుద్యోగ యువత వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి, అసమ్మతితో ఉంది. టీడీపీ హయాంలో కూడా వీరికి చేసిందేమి లేదు. కాకపోతే కనీసం ఒక డీఎస్సి ఇచ్చారు. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు నుండి నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత నిరుద్యోగ భృతి ఎత్తేశారు. కొత్త ఉద్యోగాల ప్రకటన లేదు. మెగా డీఎస్సీ లేదు. ఒక్క డీఎస్సీ కూడా లేదు. అందుకే నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నారు..!
కాపు సామాజికవర్గం ఓట్లు: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఈ సామాజికవర్గ ఓట్లు చాలా కీలకం. సుమారుగా 60 లక్షలకు పైగా ఓట్లున్నాయి. దాదాపు 60 నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలరు.. 2014 ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గం ఎంతో కొంత మేరకు టీడీపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి దాదాపు 70 శాతానికి పైగా జగన్ కి జై కొట్టారు. అక్కడక్కడా జనసేన చీల్చినప్పటికీ ఎక్కువగా వైసీపీకే మద్దతు పలికారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. అటువంటి సామాజికవర్గానికి జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత చేసింది ఏమీ లేదు అని అసంతృప్తి, అసమ్మతి అయితే కొంతమేరకు ఉంది. రిజర్వేషన్లు, కాపు కార్పోరేషన్లు, రుణాలు అనేవి పక్కన పెట్టినా అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి జగన్ సర్కార్ లో ఒక ఉప ముఖ్యమంత్రి తో పాటు అయిదు మంత్రి పదవులు కాపులకు ఇచ్చారు. కీలకమైన హోదాలు ఇచ్చారు. కానీ వాటికి స్వేచ్ఛ లేదు. ఆ సామాజికవర్గం కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అన్న భావన అయితే ఉంది. గతంలో టీడీపీ కూడా వీళ్లకు ఏమీ చేయలేదు కాబట్టి వాళ్లు అంతా వైసీపీకి మద్దతు పలికారు. ప్రస్తుతం జగన్మోహనరెడ్డి కూడా ఏమి చేయడం లేదు కాబట్టి వీళ్లు న్యూట్రల్ ఓటు బ్యాంక్ గా ఉండిపోయారు. ఈ వర్గం కోసం అటు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ విషయంలో జగన్ అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వర్గాలతో పాటు హిందూ దేవాలయాల్లో ఆరాధించే బ్రాహ్మణ వర్గాల్లోనూ కొంత మేర అసంతృప్తి ఉంది.
జగన్మోహనరెడ్డి ఈ వర్గాలను దూరం చేసుకుని చంద్రబాబుకు దారి ఇచ్చారు. అయితే ఈ వర్గాలు అయితే ప్రస్తుతానికి న్యూట్రల్ ఓటు బ్యాంకుగా ఉంది. ఈ వర్గాలు మళ్ళీ జగన్ వైపు వెళ్తారా..!? లేదా చంద్రబాబుకు దగ్గర అవుతారా లేదా, ఆ వర్గాలను దగ్గర చేసుకునేందుకు టీడీపీ ఏమైనా ప్రయత్నిస్తుందా..? లేదా ఎన్నికల సమయానికి వైసీపీనే వీళ్లకు హామీలు ఇచ్చి తమ దారికి తెచ్చుకుంటుందా అనేది ప్రస్తుతానికి ప్రస్నార్ధకమే..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?