Vangaveeti Radha Krishna: నేడు దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి. వంగవీటి రంగాను అభిమానించే నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొని నివాళులర్పించడం రివాజే. అయితే గతంలో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నా వేరువేరు పార్టీల్లో కొనసాగుతున్న నేతలు ఒకే వేదిక పంచుకున్న లేక భేటీ అయిన సందర్భాల్లో రాజకీయంగా ఆ విషయాలు చర్చనీయాంశం అవుతుంటాయి. అటువంటి సీన్ విజయవాడలో నేడు జరిగింది.
Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణతో వల్లభనేని వంశీ భేటీ
చాలా కాలం తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కార్యాలయానికి వచ్చి ఆయనను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వల్లభనేని వంశీ టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరినా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా కార్యాలయంలో భేటీ అయిన వల్లభనేని వంశీ కొద్ది సేపు చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం ఈ ఇద్దరు నేతలు పలువురు నేతలతో కలిసి వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాగా వంగవీటి రాధా కృష్ణ గుడివాడ నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో తారసపడ్డ మంత్రి కొడాలి నాని, రాధ మాట్లాడుకున్నారు. ఆ తరువాత రాధాకు విజయవాడ తూర్పు టీడీపీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. తూర్పు నుండే పోటీ చేయడానికి రాధా సుముఖంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వంగవీటి రాధ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ జరుగుతున్న తరుణంలో నేడు వల్లభనేని వంశీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.