Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అయితే కొన్ని రంగాలను సంతృప్తి పర్చలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వేతన జీవులకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊరట ఇవ్వలేదు. వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. పన్నుల శ్లాబుల్లోనూ మార్పు లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేలు గానే కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్ పై వివిధ రాజకీయ పార్టీల నేతల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. బడ్జెట్ పై నేతల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
జీరో సమ్ బడ్జెట్ – రాహుల్ గాంధీ
మోడీ సర్కార్ జీరో సమ్ బడ్జెట్ ప్రకటించిందని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని అన్నారు. మధ్య తరగతి ప్రజలకు, బడుగు, బలహీన , పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండి చేయి చూపారని రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Budget 2022: గోల్ మాల్ బడ్జెట్ – తెలంగాణ సీఎం కేసిఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గోల్ మాల్ బడ్జెట్ గా అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసిఆర్. బడ్జెట్ లో ఎవరికీ న్యాయం జరగలేదని అన్నారు. అమెరికా భీమా కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం బ్రోకర్ గా వ్యవహరిస్తుందని కేసిఆర్ ఘాటుగా విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉద్యమిస్తామని అన్నారు. ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని కేసిఆర్ డిమాండ్ చేశారు. గోదావరి ట్రైబ్యునల్ పై సుప్రీం కోర్టులో కేసు ఉండగా, బడ్జెట్ లో నదుల అనుసంధానానికి ఎలా నిధులు కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆ అధికారం ఎవరిచ్చారని అన్నారు. ఘోరమైన పద్ధతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేసిఆర్ ..ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్లు అని ప్రశ్నించారు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడమేనని విమర్శించారు. ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం వరుసగా అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. కేంద్రానికి పాలసీ లేదు, పాడు లేదు. కేంద్ర బడ్జెట్ పైన పటారం, లోన లోటారం అని కేసిఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో వైసీపీ మరో సారి విఫలం – చంద్రబాబు
బడ్జెట్ లో ఏపి ప్రయోజనాలను సాధించడంలో మరో సారి వైసీపీ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. 28 మంది వైసీపీ ఎంపిలు ఉండి రాష్ట్రానికి ఏమి సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో కేంద్రం చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామని చంద్రబాబు అన్నారు.
Budget 2022: ఏపికి అన్యాయం – విజయసాయిరెడ్డి
కేంద్ర ఆర్దిక శాఖ ఫార్ములాతో ఏపికి అన్యాయం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. పన్నుల వాటాలో ఏపికి వచ్చేది కేవలం రూ.4వేల కోట్లేనన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటరాదంటోందని విమర్శించారు. ఎఫ్ఆర్ బీఎంపై కేంద్రానివి ద్వంద్వ ప్రమాణాలు అని విజయసాయి పేర్కొన్నారు. రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నామని తెలిపారు విజయసాయిరెడ్డి. నదుల అనుసంధానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజయసాయి విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్ అన్ని విధాలుగా నిరుత్సాహపరిచే బడ్జెట్ అని విజయసాయి అసంతృప్తి వ్యక్తం చేశారు.