Balineni Srinivasa Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గంలో బాలినేని పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారనీ, రాజీనామాకు సిద్ధమయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు మూడు పర్యాయాలు ఆయనతో సమావేశమైయ్యారు. మరో పక్క ఒంగోలులో బాలినేని అనుచరులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ ఆదేశాల మరేకు సోమవారం సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు నేతలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జగన్ తో సమావేశమైయ్యారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాము వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ కు విధేయులమని చెప్పారు.
రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను బాలినేని ఖండించారు. పార్టీ యే బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీ అని చెప్పారు. తనకు ఎటువంటి అసంతృప్తి లేదని, తమది అంతా ఒక కుటుంబం అని చెప్పుకొచ్చారు. సజ్జల తనతో బేటీలపై వివరణ ఇస్తూ వారంలో ఒకటి రెండు సార్లు కలుస్తూనే ఉంటామని, అలానే తన నివాసానికి సజ్జల వచ్చారు తప్ప మరేమి లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో గతంలో వచ్చిన సీట్లకు మించి వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదిమూలపు సురేష్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కలిసి పని చేశామన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉందని దానిపై చర్చించినట్లు బాలినేని వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగిస్తూ బాలినేని తప్పించడంపై ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులో నిన్న రాత్రి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం కూడా చేశారు. పార్టీ కార్యాలయం వద్ద జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలోనే బాలినేని అసంతృప్తితో ఉన్నారనీ, మనస్థాపానికి గురై రాజీనామాకు సిద్ధపడ్డారంటూ వార్తలు వచ్చాయి. సీఎంతో భేటీ అనంతరం టీకప్పులో తుఫానులా వివాదం సద్దుమణిగింది.