YSRCP: ఏపి, తెలంగాణాతో సహా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపిలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బీజేపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి మరో సారి రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలపై పార్టీలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరో పక్క పారిశ్రామిక వేత్తల నుండి జగన్ పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP: అప్పుడు అంబానీ..ఈ సారి ఆదానీకి
ఇంతకు రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ సిఫార్సు మేరకు పరిమళ్ నత్వానీని జగన్ రాజ్యసభ కు పంపగా, ఈ సారి మరో దిగ్గజ వ్యాపారవేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు స్థానాలను సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీలకు కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిలను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటు హామీతోనే బీద మస్తాన్ రావును ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలోకి చేర్చుకున్నట్లు ఆనాడు వార్తలు వచ్చాయి. బీద మస్తాన్ రావును రాజ్యసభకు పంపితే ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు అవుతుంది. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరారు.
వీరికి అడియాసే
ఇటీవల రాజ్యసభ రేసులో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సినీ నటుడు ఆలీ, తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త మైహోం (జూపల్లి) రామేశ్వరరావు, చిలకలూరిపేటకు చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే రాజ్యసభ అభ్యర్ధుల విషయంపై ఓ క్లారిటీకి వచ్చేశారనీ, త్వరలో అధికారికంగా అభ్యర్ధుల పేర్లను వెల్లడించనున్నారనీ సమాచారం.