మూక దాడిలో మరణించిన ప్రకాష్ లక్రా భార్య జెర్మైన్ను (ఎడమ) విచారిస్తున్న పోలీసు అధికారులు; courtesy: Indian Express
జార్ఖండ్లో చనిపోయిన ఎద్దు చర్మం వలుస్తున్నవారిపై మూక జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురు గాయపడ్డారు. బుధవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడి చికిత్స పొందుతున్న వారిపై పోలీసులు శుక్రవారం కేసు పెట్టారు.
జుర్మో గ్రామంలో అద్రానిష్ కుజూర్కు చెందిన ఎద్దు పొలంలో మృతి చెందింది. దాని చర్మం వలిచేందుకు కొందరు అక్కడికి వెళ్లారు. కాస్సేపటికి కర్రలు , ఇనుప కడ్డీలు పట్టుకున్న గుంపు ఒకటి అక్కడకు వచ్చింది. చాలామంది పారిపోగలిగారు కానీ నలుగురు గుంపు చేతికి చిక్కారు.
వారిని చితగ్గొట్టి పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అప్పటికే వారిలో ప్రకాష్ లక్రా అనే వ్యక్తి మరణించాడు. చనిపోయిన వ్యక్తి, గాయపడినవారు అందరూ కూడా ఆదివాసీ క్రైస్తవులు. గ్రామస్థులు తర్వాత ఇచ్చిన ఫిర్యాదుపై ఆవును వధించారంటూ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆదివాసీలపై దాడి చేసినందుకు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ఇద్దరిపై గతంలో హత్య, కిడ్నాప్ వంటి కేసులు ఉన్నాయని ఎస్పి అంజనీ కుమార్ ఝా తెలిపారు.