ముఖ్యమంత్రి కావాలన్న కోరిక (ఆకాంక్ష) తీరకముందే ఓ సీనియర్ నేత, మంత్రిగానే గుండె పోటుకు గురై మృతి చెందారు. కర్ణాటక కు చెందిన సీనియర్ నేత, అటవీ శాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాధకత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో మంగళవారం రాత్రి గుండె పోటుకు గురై పడిపోవడంతో సహాయకులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించినా ఆయన శరీరం స్పందించలేదు. గుండె పోటుతో అకాలమరణం చెందిన విశ్వనాథకత్తి జీవిత ఆశయం ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని. ఇదే విషయం ఆయన పలు సందర్భాల్లో ప్రకటించుకున్నారు. ఉత్తర కర్ణాటక ను విభజిస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆయన పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెళగాని జిల్లా హుక్కేరి నుండి విశ్వనాథకత్తి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాక అయిదు సార్లు మంత్రిగా సేవలు అందించారు. సదానంద గౌడ మంత్రివర్గంలో మొదటి సారిగా వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథకత్తి.. యడియూరప్ప మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బొమ్మై మంత్రివర్గంలో ప్రస్తుతం ఆహార, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహ ఉన్నారు.
మంత్రి విశ్వనాథకత్తి మరణవార్త తెలియడంతో సీఎం బసవరాజు బొమ్మై సహా మంత్రివర్గ సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరారు. సీఎం బొమ్మై, మంత్రులు ఆయన మృతికి దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశ్వనాథకత్తి అభిమానులు ఆయన చిరకాల వాంఛ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయారంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుండి రాహుల్ భారత్ జోడో యాత్ర ..తండ్రి స్మారకం వద్ద రాహుల్ ఘన నివాళి