టీడీపీ అధినేత చంద్రబాబు పై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపి సీఎం వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను తమకు ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లనే ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఆరోపించారు. నిజాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ అన్నారు సీఎం జగన్. ఏపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు .. సోమవారం పోలవరం పై చర్చ సందర్భంగా టీడీపీ విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే పరిహారం ఇస్తామని చెప్పామనీ, దానికి కట్టుబడే ఉన్నామని అన్నారు. అందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. 30 జూన్ 2021న విడుదల చేసిన జీవోను చూపించారు సీఎం జగన్.
ఆర్ అండ్ ఆర్ కింద గత ప్రభుత్వంలో రూ.6.86 లక్షల పరిహారం ప్రకటిస్తే తాము అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామనీ, అందుకు సంబంధించిన జీవో స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ పెంపు వల్ల రూ.500 కోట్లు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుందని, ఎవరూ భయపడాల్సిన, భాదపడాల్సిన అవసరం లేదని అన్నారు. అమ్మఒడి, ఆసలా వంటి పథకాలకే అంతకు మించి సొమ్ము బటన్ నొక్కి బదిలీ చేశామనీ, కాబట్టి పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు అని పేర్కొన్న.. జగన్ దాని రిపేర్ కు తమ ప్రభుత్వం కుస్తీలు పడుతోందని తెలిపారు. కేంద్రం నుండి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందనీ, ఆ నిధులు బ్లాక్ కావడానికి కారణం చంద్రబాబేనని విమర్శించారు. ఆనాడు కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ఆప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో గణాంకాలను పరిశీలిస్తే ఎవరి చిత్తశుద్ది ఎంత ఉందో స్పష్టమవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 3073 మందికి రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్న సీఎం జగన్.. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం 10,300 మందికి రూ,1722 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. ప్రాజెక్టుకు మొదట స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత కాపర్ డ్యామ్ కట్టాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ సరి చేస్తున్నామన్నారు. ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే ఇాలంటి దుస్థితి వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబు అసలు ఎమ్మెల్యే గా కూడా అన్ ఫిట్ అంటూ వ్యాఖ్యానించారు. వర్షాకాలంలో పనులు జరగలేదనీ, నవంబర్ నుండి యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతాయని జగన్ తెలిపారు. ముందుగా టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కింజారపు అచ్చెన్నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై అడిగిన ప్రశ్నకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు.
ప్రారంభమైన ఏపి అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు