Munugodu Bypoll: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చిన సంగతి తెలిసిందే. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని టీఆర్ఎస్ ఆ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. అయితే ఈసీ నుండి అధికారిక గుర్తింపు రాకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రాంతీయ పార్టీ) గానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగానే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలో ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లు చూసి టీ కాంగ్రెస్ షాక్ అయ్యింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రూపొందించిన బ్యాలెట్ పేపర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ ను మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి బుధవారం విడుదల చేశారు. అయితే ఈ బ్యాలెట్ పేపరులో మొదటి స్థానంలో బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో ఉన్న ఆందోజు శంకరాచారి పేరు, ఎన్నికల గుర్తు ఉండగా, రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పేరు, ఎన్నికల గుర్తు ఉన్నాయి. మూడవ స్థానంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి, నాల్గవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి పేర్లు, ఎన్నికల గుర్తు ఉన్నాయి. బ్యాలెట్ పేపరులో ఈ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్ధుల పేర్లు ముందు ఉండాలి. ఆ తరువాత ప్రాంతీయ పార్టీల అభ్యర్ధుల పేర్లు ఉండాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెబుతూ తొలుత బీఎస్పీ, ఆ తర్వాత స్థానంలో బీజేపీ, మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు ఉండాలని పేర్కొంటున్నారు. జాతీయ పార్టీల తర్వాత ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి పేరు నాల్గవ స్థానంలో ఉండాలని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా టీఆర్ఎస్ అభ్యర్ధి పేరును రెండో స్థానంలో ఎలా పెడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనలు మరో మారు పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్ధి పేరును నాల్గవ స్థానానికి మార్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే నమూనా బ్యాలెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీఆర్ఎస్ ను ఈసీ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా గుర్తించిందేమో అన్న కామెంట్స్ వినబడుతున్నాయి.
బీజేపీ గూటికి చేరిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్