దీపావళి పండుగ వేళ ఏపిలోని పలు ప్రాంతాల్లో వేరువేరు కారణాలతో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది షాపులు అగ్నికి ఆహుతి కాగా, అనంతపురం జిల్లాలో 25 బైక్ లు, సామాగ్రి కాలి బుడిద అయ్యాయి. గుంటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలోనూ అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో అర్దరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింద ఉన్న ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగింది. ఈ దుకాణం నుండి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న సుమారు పది దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకుని దగ్దమైన షాపులను పరిశీలించారు. కలెక్టర్, అధికారులతో చర్చించి నష్టం అంచనా వేసి బాధితులైన వారికి ప్రభుత్వ పరంగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా కేంద్రంలోని పాలీమర్ ప్లాస్టిక్ వ్యర్దాల గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు అగ్ని మాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది. ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదాల్లో రెండున్నర లక్షల ఆస్తినష్టం సంభవించింది. కడప విజయదుర్గా కాలనీలో గల దుర్గా అపార్ట్ మెంట్ లోని ఒక ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిద అయ్యింది. సుమారు రూ.2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. మోచంపేట లోని ఓ జిరాక్స్ రిపేర్ సెంటర్ లోకి టపాసులు దూసుకువెళ్లడంతో మంటలు అంటుకున్నాయి. షాపులోని పలు సామాగ్రి దగ్ధం అయ్యింది. సుమారు రూ.20వేల ఆస్తినష్టం వాటిల్లింది.
అనంతపురం జిల్లా పాపిడి పట్టణంలోని మెకానిక్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెకానిక్ షెడ్ కు నిప్పు అంటుకోవడంతో 25 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. రూ.45 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు. స్పేర్ పార్ట్స్ మొత్తం పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఎస్ఆర్ పేట మండలం గడిపాడు ఎస్టీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటితో సహా ఇద్దరి కుమారుల పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామానుతో పాటు పొదుపు రుణంగా తీసుకున్న రూ.50వేల నగదు మంటల్లో కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితులకు గ్రామ సర్పంచ్ నిత్యావసరాలు, నగదు సహాయం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అయిదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దపురం పద్మనాభం కాలనీలో తారా జువ్వలు పడి పూరిల్లు దగ్ధం అయ్యింది.