YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓ బాలుడి వైద్య సాయానికి రూ.22 లక్షలు మంజూరు చేసి తన దొడ్డ మనసును మరో సారి చాటుకున్నారు. ఇంతకు ముందు సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమకు వెళ్లిన సమయంలో అరుదైన (గాకర్స్) వ్యాధితో బాధపడుతున్న ఓచిన్నారి హానీ తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిలు ప్లకార్డు ప్రదర్శిస్తూ సీఎం దృష్టిలో పడగా, ఆ చిన్నారి తల్లిదండ్రుల నుండి బాలిక అనారోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ చిన్నారి వైద్య చికిత్సకు అవసరమయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.
అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత హానీ వైద్య ఖర్చులకు కోటి రూపాయలు మంజూరు చేశారు సీఎం జగన్. అంతకు ముందు మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ బాలుడికి రూ.10వేల ఆర్ధిక సాయం అందజేయడంతో పాటు రూ.35వేల వీల్ చైర్ అందించారు. వికలాంగ పెన్షన్ మంజూరు చేశారు. తాజాగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్ (7) వైద్య ఖర్చులకు రూ.22లక్షలు ఆర్ధిక సహయం మంజూరు చేశారు.
ఆ బాలుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్య ఖర్చులకు రూ.22 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. బాలుుడ తల్లిదండ్రులకు అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థోమత లేకపోవడంతో ఈ విషయాన్ని గోదావరి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి వెంకటేశ్వరబాబుకు తెలియజేశారు. దీంతో ఆయన శుక్రవారం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి లో ఇథనాల్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ ను కలిసి ఆ బాలుడి అనారోగ్య పరిస్థితిని, అతని తండ్రి ఆర్ధిక పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే సీఎం స్పందించారు. సీఎం సహాయ నిధి నుండి రూ.22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్ రెడ్డికి అందజేశారు.